వికారాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : చేవెళ్లలో బడుగు, బలహీన వర్గాల గొంతుక జ్ఞానేశ్వర్ గెలుస్తున్నారనేది రేవంత్రెడ్డికి అర్థమైపోయి ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన వికారాబాద్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ కష్టకాలంలో ఉంటే తానున్నానని ముందుకు వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. విశ్వేశ్వర్రెడ్డికి మోదీ, రంజిత్రెడ్డికి రేవంత్ అండగా ఉంటే.. కాసానికి అండగా.. కేసీఆర్, తెలంగాణ ప్రజానీకం ఉన్నదన్నారు. పార్టీ తరపున రంజిత్రెడ్డి, విశ్వేశ్వర్రెడ్డిలను ఎంపీలుగా చేస్తే మోసం చేశారన్నారు. వీరు బీఆర్ఎస్ శ్రేణులను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారన్నారు. మోదీ, రేవంత్రెడ్డి అండగా ఉన్నారని వాళ్లు విర్రవీగుతున్నారని.. వారికి తగిన శాస్తి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అవకాశవాదిని ఓడించాలి..
అవకాశవాది రంజిత్రెడ్డిని ఓడించాల్సిన బాధ్యత మనపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తుంటే, కేసీఆర్ బిడ్డ కవితమ్మను అరెస్ట్ చేస్తుంటే, అదేరోజు నవ్వుకుంటూ పోయి రేవంత్రెడ్డితో కండువా కప్పిచ్చుకున్నారని మండిపడ్డారు. రంజిత్రెడ్డి పార్టీ మారిన తర్వాత సోషల్ మీడియాలో నీకు ఏం పుట్టింది, ఎందుకు మారినవ్ పార్టీ అని యువకులు తిడుతున్నారన్నారు. రాజకీయాల్లో గెలుస్తాం, ఓడుతాం.. అయితే విడిచిపెట్టి పారిపోతామా.. అనేది ఆలోచించాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేదుంటే రంజిత్రెడ్డి కాంగ్రెస్లోకి పోయేవాడా అని ప్రశ్నించారు. స్వార్థం కోసం ఆయన తోవ చూసుకున్నాడని.. పార్టీ మారకున్నా సరే బీఆర్ఎస్లోనే ఉండి తనకు సహకరించాలని పార్టీ శ్రేణులకు ఫోన్లు చేయడం ఎంతవరకు సబబని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే.. మీకు వారు విలువనిస్తారా అని ఆలోచించాలన్నారు.
అనామకులను గెలిపించింది కేసీఆర్..
జీవితంలో మంత్రి కావాలని కలలు కన్న పట్నం మహేందర్రెడ్డిని రెండుసార్లు మంత్రిని చేసింది కేసీఆర్ అని.. రంజిత్రెడ్డి ఎవరో ఈ ప్రాంతం వారికి తెలియదు కానీ అట్లాంటి అనామకుడిని నిలబెట్టి గెలిపించింది కేసీఆర్ అని పేర్కొన్నారు. మరోవైపు నటనలో ఆస్కార్ ఇస్తే రంజిత్రెడ్డి, మహేందర్రెడ్డి అర్హులని ఎద్దేవా చేశారు. వారిద్దరు చివరి వరకు పార్టీలో ఉంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి దగా చేశారన్నారు.
మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా సునీతా మహేందర్రెడ్డిని, చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్రెడ్డిని ప్రకటించారని.. అయితే వారు తప్పక ఓడిపోతారని తెలిపారు. మనకు బీజేపీతోనే పోటీ ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. మన పార్టీకి ఉన్న నాయకత్వం, మన పార్టీకి ఉన్న కమిట్మెంట్ ఉన్న కేడర్ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదని, కొట్టుకుపోయే చెత్తంతా కొట్టుకుపోతుందని, నిఖార్సుగా నిలబడ్డోడు మనోడని.. రంజిత్రెడ్డి, మహేందర్రెడ్డి మళ్లీ తిరిగి వచ్చినా మీరొద్దురా నాయనా అని వెళ్లగొడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సురభివాణీదేవి, జడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్కుమార్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేందర్గౌడ్, బీఆర్ఎస్ నేత పంజుగుల శ్రీశైల్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భారీ మెజార్టీతో గెలిపించుకుందాం ; మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
పార్టీని వీడిన వారికి బుద్ధి వచ్చేలా కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. కొడంగల్ అభివృద్ధికి కోట్ల నిధులు కేటాయిస్తున్న రేవంత్రెడ్డి వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు ఎందుకు నిధులివ్వడం లేదు. కేసీఆర్ పాలనలో సంక్షేమం స్వర్ణయుగంగా ఉండేది. ఎన్నో ఏండ్ల కల అయిన వికారాబాద్ జిల్లా ఏర్పాటు, కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో లబ్ధిపొందిన వారి ఇంటికెళ్లి గుర్తు చేయాలి. నాలుగు నెలలు గడుస్తున్నా పాలమూరు ప్రాజెక్టు ప్రస్తావన లేదు. కార్యకర్తలపై పోలీసులతో కేసులు పెట్టిస్తే క్షణాల్లో మీ ముందుంటాం.
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా.. ; కాసాని జ్ఞానేశ్వర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి
మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను ఆశీర్వదిస్తే, పార్లమెంట్లో మీ గొంతుకనై ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. ఇద్దరిని ఎంపీలుగా గెలిపిస్తే వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినవారికి బుద్ధి చెప్పాలి. ఎవరైతే మంచి చేస్తారో వారినే గెలిపించాలి.
పార్టీ మారే ప్రసక్తే లేదు..; చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నేను పార్టీ మారుతాననే ప్రచారం జరుగుతున్నది.. కానీ పార్టీ మారే ప్రసక్తే లేదు. 40 ఏండ్లుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు సేవ చేస్తున్నా. కాసానిని గెలిపించాలి. కొండా విశ్వేశ్వర్రెడ్డి మాటలను నమ్మి మోసపోవద్దు. ఎక్కడో ఉన్న రంజిత్రెడ్డిని తీసుకొస్తే దగా చేసిండు. 70 ఏండ్లలో ఏ సీఎం కూడా చేయని పనులను కేసీఆర్ చేశారు.
పార్టీలో ప్రస్తుతం ఉన్నవారికే ప్రాధాన్యమివ్వాలి ; వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
పార్టీలో ప్రస్తుతం ఉన్నవారికే భవిష్యత్తులో ప్రాధాన్యమివ్వాలి. మన పార్టీలో ఉంటూ ఇతర పార్టీల కోసం చేసే అవకాశవాదులను చేరదీయొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే కరువు వచ్చింది. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ స్వర్ణయుగంగా ఉన్నది. రంజిత్రెడ్డికి కేసీఆర్ చాలా చేసినా.. పార్టీని మోసం చేసి వెళ్లిపోయారు. ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.
అందరం ఐక్యమై కాసానిని గెలిపించుకోవాలి ; మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి
అందరం ఐక్యమై కాసానిని గెలిపించుకుందామని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. వంద రోజుల్లో గ్యారెంటీల అమలు ఏమయిందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, కలిసికట్టుగా పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాలన్నారు.
వికారాబాద్ ప్రజల సత్తా ఏందో చూపించండి ; బీఆర్ఎస్ సీనియర్ నేత కార్తీక్రెడ్డి
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన రంజిత్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తున్నారు. వికారాబాద్ ప్రజలు సత్తా చూపి రంజిత్రెడ్డికి బుద్ధి చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది. ఈ రెండు పార్టీలు ఒకటే. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కొత్తవారేమీ కాదు. అందరికీ తెలిసిన వ్యక్తి. 96 బీసీ కులాలను ఏకం చేసిన బడుగు, బలహీన వర్గాలకు గొంతుకగా ఎన్నో ఏండ్లుగా వ్యవహరిస్తున్న కాసానిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.