వికారాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): అన్నదాతలకు సాగు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో అందిన పెట్టుబడి సాయంతో అప్పుల కోసం ఎదురుచూడకుండా విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసి పంటలను ఉత్సాహంగా సాగు చేసుకోగా.. రేవంత్రెడ్డి ప్రభుత్వంలో అదును దాటుతున్నా సాయం అందకపోవడంతోపాటు మరోవైపు అప్పులు దొరకక కష్టాలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేయగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది.
కాంగ్రెస్ హామీనిచ్చిన రైతుభరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రారంభించకపోగా.. రైతుబంధు సాయం నిమి త్తం ఉన్న నిధులను కూడా బ్యాంకు ఖాతాల్లో జమ చేయకపోవడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు సాయాన్ని జిల్లాలోని మూడు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే ఇప్పటివరకు అందించారు. జిల్లావ్యాప్తంగా 2,95,796 మంది రైతులుండగా 2,00,567 రైతుల కు రైతుబంధు సాయాన్ని జమ చేశారు. మరో 95వేల మంది రైతులకు అందాల్సి ఉన్నది. యా సంగి సీజన్ రైతుబంధు కింద రూ.322 కోట్లకుగాను రూ.135 కోట్లను పంపిణీ చేశారు. ఈ యా సంగికి రైతుబంధు సాయం అందకపోగా.. బ్యాంకర్లు పంట రుణాలను మంజూరు చేయకపోవడంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు బ్యాంకర్లు అరకొర రుణాలనే మంజూరు చేశారు. నిర్దేశించిన లక్ష్యంలో 35శాతం మేర అందించాయి. ఈ ఏడాది వానకాలం, యాసంగి సీజన్లకుగాను రూ. 3,082 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటివరకు రూ.1,786 కోట్ల రుణాలను మా త్రమే బ్యాంకు అధికారులు రైతులకు అందించారు. వానకాలంలో రూ.1,550 కోట్ల రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని రూ.1,225 కోట్లు, యాసంగి సీజన్లో రూ.1,532 కోట్ల రుణాలకు గాను ఇప్పటివరకు రూ.561 కోట్ల రుణాలను మాత్రమే మంజూరు చేశారు. యాసంగి సీజన్ దాటిపోతున్నా రైతులకు పంట రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం ప్రభుత్వం బ్యాంకర్లను పట్టించుకోకపోవడంతో పంట రుణాలివ్వడంతో నిర్లక్ష్యం చేస్తున్నారు. మరోవైపు రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో అప్పులు మాఫీ అవుతాయని ఎదురుచూస్తున్న రైతులను బ్యాంకర్లు ఇబ్బందిపెడుతున్నారు. వారం రోజుల క్రితం వికారాబాద్ నియోజకవర్గంలో రూ.2 లక్షల పంట రుణాలకు సంబంధించి ఓ రైతు ఇంటికెళ్లిన బ్యాంకర్లు దౌర్జన్యం చేసి ఇంట్లోని టీవీ, ఫ్రిజ్ను తీసుకెళ్లినట్లు తెలిసింది. బ్యాంకర్లు అప్పులు తీర్చాలని రైతులను ఇబ్బందులు పెడుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకంతో పెట్టుబడి సాయాన్ని అందించి రైతులను అప్పుల బారి నుంచి ఆదుకున్నది. ప్రభుత్వం ప్రతిఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించడంతో అన్నదాతలకు పంట రుణాల కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన తిప్పలు తప్పాయి. రైతుబంధు పథకం కింద బీఆర్ఎస్ ప్రభుత్వం వికారాబాద్ జిల్లాకు రూ.2,622 కోట్ల సాయాన్ని అందజేసింది.
2018 వానకాలం సీజన్లో 1,94,833 మంది రైతులకు రూ.221 కోట్లు, యాసంగిలో 1,75,989 మంది రైతులకు రూ.206 కోట్లు, 2019 వానకాలంలో 1,78,998మందికి రూ.255 కోట్లు, యాసంగి సీజన్లో 1,71,824 మందికి రూ.194 కోట్లు, 2020 వానకాలంలో 2,113,341 మందికి రూ.297 కోట్లు, యాసంగిలో 2,19,264 మందికి రూ.301 కోట్లు, 2021 వానకాలంలో 2,25,438 మందికి రూ.300 కోట్లు, యాసంగిలో 2,24,928 మందికి రూ.241 కోట్లు, 2022-23 వానకాలంలో 2,47,707 మందికి రూ. 305 కోట్లు, యాసంగిలో 2,43,447 మంది రైతులకు రూ.299 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.