18 ఏండ్లు నిండినవారికి ఇచ్చేందుకు ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లాలో44 వ్యాక్సినేషన్ కేంద్రాల ఏర్పాటు
75 రోజుల వరకు వ్యాక్సిన్ వేసేందుకు నిర్ణయం
రంగారెడ్డి, జూలై 14, (నమస్తే తెలంగాణ): కొవిడ్ వైరస్ను ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి 18 ఏండ్లు నిండినవారికి బూస్టర్ డోస్ వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 60 ఏండ్లు పైబడినవారికి బూస్టర్ వేస్తుండగా, నేటి నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. జిల్లాలో బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చేందుకుగాను జిల్లా వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సెకండ్ డోస్ వేసుకొని ఆరు నెలలు దాటిన వారికి బూస్టర్ డోస్ వేయనున్నారు. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసేందుకు జిల్లావ్యాప్తంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలోని 40 ప్రాథమిక కేంద్రాలతోపాటు రెండు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, వనస్థలిపురం ఏరియా దవాఖాన, కొండాపూర్లోని జిల్లా దవాఖానలో బూస్టర్ డోస్ వేయనున్నారు. 18 ఏండ్లు నిండి సెకండ్ డోస్ వేసుకొని 6 నెలలు పూర్తైనవారు ఆధార్ కార్డు జిరాక్స్తో వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. జిల్లాలో 18 ఏండ్లు నిండినవారు 23,28,538 మంది ఉండగా, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తై బూస్టర్ డోస్కు అర్హులు 18.94 లక్షల మంది ఉన్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు ఫస్ట్ డోస్-28,21,898 మంది, సెకండ్ డోస్-25,05,653 మందికి ఇచ్చారు. ఇప్పటివరకు 60 ఏండ్లు పైబడిన 1,37,934 మందికి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది.
పరిగి, జూలై 14 : వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇచ్చేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వికారాబాద్ సీహెచ్సీలో బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. జిల్లాలో 60 ఏండ్లు పైబడినవారు, ఆరోగ్య, ఫ్రంట్లైన్ సిబ్బంది 97,249 మందికి బూస్టర్ డోస్ ఇచ్చారు. 18 ఏండ్లు పైబడినవారిలో మొదటి డోసు 773691 మందికి ఇవ్వగా, రెండో డోసు 762989 మందికి ఇచ్చారు. గతంలో బూస్టర్ డోస్ వ్యవధి 9 నెలలుండగా 6 నెలలకు తగ్గించారు. ఈ నెల 15 నుంచి 75 రోజులపాటు ఉచితంగా ఈ బూస్టర్ డోస్ అందించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేపట్టామని, 18 నుంచి 59 ఏండ్ల వయస్సువారు ఉచితంగా బూస్టర్ డోస్ టీకా వేయించుకోవాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ జీవరాజ్ కోరారు.