పరిగి, నవంబర్ 30 : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని జాతీయ కేంద్ర కీటక జనక వ్యాధుల నివారణ అదనపు సంచాలకులు డాక్టర్ అమర్సింగ్నాయక్ ఆదేశించారు. మంగళవారం ఆయన కుటుంబ నియంత్రణ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, మలేరియా డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లుతో వికారాబాద్లోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. ఆయా విభాగాల ప్రోగ్రామ్ ఆఫీసర్లతో వారు ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అమర్సింగ్నాయక్ మాట్లాడుతూ కొవిడ్తో సుమారు రెండేండ్లుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిలిచిపోయాయని, గతంలోవలె జిల్లాలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల శిబిరాలు ప్రారంభించాలని చెప్పారు. ఇందుకు సంబంధించిన పరికరాలు స్టెరిలైజ్ చేయడంతోపాటు, అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. కు.ని ఆపరేషన్ కోసం వచ్చేవారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించాలని, దీంతో వారికి, వైద్య బృందానికి సురక్షితంగా ఉంటుందని తెలిపారు. కు.ని శిబిరాల్లో పరిమితంగా 25 నుంచి 30 మందికి ఆపరేషన్లు చేయాలని పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారని, ఇతర కార్యక్రమాలపై సైతం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన చెప్పారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని పునరుద్ధరించాల్సిందిగా ఆదేశించారు. ఇండ్లు, ఆవరణల్లోని పాత సామగ్రిలో నిలువ ఉండే నీటిని వారానికి ఒకసారి తప్పనిసరిగా పారబోయించేలా అవగాహన కల్పించాలని సూచించారు. మలేరియా, ఫైలేరియా, డెంగీ నియంత్రణ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. దవాఖానలకు జ్వరంతో వచ్చే ప్రతి ఒక్కరి రక్త నమూనాలను సేకరించి డయాగ్నస్టిక్ సెంటర్కు పంపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి తుకారాంభట్, పలు కార్యక్రమాల ప్రోగ్రామ్ ఆఫీసర్లు ఉన్నారు.