యాలాల, డిసెంబర్ 31 : దానం అంటే ఉదారముగా ఇచ్చేది అని అర్థం. కానీ ఇందులో కూడా స్వార్థం ఉంది. దానం చేస్తే పుణ్యము వస్తుందని… మళ్లీ జన్మలో మంచి జరుగుతుందని చాలా మంది దానం చేస్తారు. ఈ లోకములో గానీ, పర లోకములో గానీ… ఏమీ ఆశించకుండా ఉదారముగా ఇవ్వడాన్నే దానం అనాలి. షోడశ దానాలైన గావ(ఆవులు), సువర్ణ(బంగారం), రజిత(వెండి), రత్నాన్ని(నవ రత్నాలలో ఏదో ఒకటి లేదా అన్ని), సరస్వతి (పుస్తకం), ధాన్యం(ఏ ధాన్యమైనా సరే), పయస్వినీం(పాలిచ్చే శక్తి ఉన్న ఈనని గోవు, చత్రం(గొడుగు), గృహం(ఇల్లు), తిల(నువ్వులు), కన్య(అల్లునికి వివాహంలో కూతురు), గజ(ఏనుగు), అశ్వ(గుర్రం), శయ్య(మంచం), వస్త్రం(బట్టలు), మహి(భూమి)లను దానం చేసినట్టయితే విశేష ఫలితాలు ఉంటాయి.
హిందూ ఆచార సంప్రదాయాల్లో దాన ధర్మాలు చేయటం అన్నది పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తున్నది. మోక్ష సాధన కోసం ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. తనకున్న దానిలో కొంత భాగాన్ని లేని వారికి దానం చేస్తే పుణ్యం దక్కుతుందని భావిస్తారు. దాన ధర్మాలకు సంబంధించి అనేక రకాలు ఉన్నాయి. అన్నదానం, వస్త్రదానం, జలదానం, గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవి దానాల్లో కెల్లా విశిష్టమైనవి.
నేటి కాలంలో రక్తదానం మహాదానంగా నిలుస్తుంది. రక్తదానం మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదిస్తున్నది. రక్తదాతలు ప్రాణదాతలు. మూడు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మరోకరికి ప్రాణదానం చేసినవారవుతారు. రక్తం గ్రూపులు వేరైనా రంగు మాత్రం ఒక్కటే. మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరం.
నేడు సకాలంలో రక్తం అందక చనిపోతున్నవారు ఎందరో… అత్యవసర చికిత్సలు, క్లిష్టమైన ప్రసవాల సమయంలో రక్తం ఎంతో అవసరమవుతున్నది. దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరమవుతుంది. సరైన అవగాహన లేనందున రక్తదానం చేసేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. రక్తదాతలు ముందుకొస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు. ఇటీవల ఆన్లైన్లో దాతల వివరాలు అందుబాటులో ఉంచుతూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చినప్పటికీ… వీటి గురించి తెలియకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
రక్తదానంతో జీవితంలో ఇబ్బందులొస్తాయని చాలా మంది బయపడుతుంటారు. వాస్తవానికి రక్తం ఇవ్వడం వల్ల సదరు వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. వైద్యులు పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యవంతులని, సరిపోయినంత రక్తం ఉందని నిర్థారించుకొన్న తరువాతే మన నుంచి రక్తం తీసుకుంటారు. రక్తదానం చేసిన తరువాత ఆరు నుంచి పన్నెండు వారాలలోపు వ్యక్తికి పూర్తి స్థాయిలో కొత్త రక్తం తయారవుతుంది. ఎలాంటి రక్తహీనత సమస్యలు తలెత్తవు.
మానవుల్లో రక్త వర్గాలు నాలుగు. ఏ, బీ, ఏబీ, ఓ. (O-, O+, A-, A+, B-, B+, AB-, AB+).
విశ్వదాతలు: O గ్రూప్ రక్త వర్గంగల వ్యక్తుల్లో వారి రక్త కణాల మీద ప్రతి జనకాలు(Antigens) ఉండవు. అందుచేత గ్రహీతల్లో రక్తకణాల గుచ్చకరణం ఏర్పడదు. అందుచేత O గ్రూప్ రక్తం గల వ్యక్తి ఏ గ్రూప్ వారికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. అందువల్ల O గ్రూప్ గల వారిని విశ్వదాతలు అంటారు.
విశ్వగ్రహీతలు: AB గ్రూప్ రక్త వర్గం గల వ్యక్తుల్లో ప్లాస్మాలో ప్రతిరక్షకాలు (Antibodies) ఉండవు. అందుచేత వీరి రక్తం, ఇతర వర్గాల రక్తంతో చర్య జరపదు. కాబట్టి AB రక్త వర్గంగల వ్యక్తులు ఇతర వర్గాల (A,B,AB,O) రక్తాన్ని గ్రహించవచ్చు. అందువల్ల వీరిని విశ్వగ్రహీతలు అని పిలుస్తారు.
మానవునిలో, Rhesus కోతులలో Rh కారకాన్ని లాండ్సీనర్, అలెగ్జాండర్ వీనర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. Rhesus పేరులోని మొదటి రెండు అక్షరాల మీదుగా Rh పెట్టారు. ఈ Rhలో రక్త కణాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నట్లయితే Rh+అని, లేనట్లయితే Rh- అని పిలుస్తారు.
మన దేశంలో 37 శాతం మంది మాత్రమే రక్తదానం చేయడానికి అర్హులు. అయితే వారిలో ప్రతి సంవత్సరం 10 శాతం కంటే తక్కువ మంది మాత్రమే రక్తదానం చేస్తున్నారు. రక్తం మనకు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన బహుమతి. రక్తదానం చేయడమంటే ఓ మనిషికి జీవనదానం చేయడమే. మనం ఇచ్చే రక్తం ఆ రోజు కాకపోయిన మరో రోజు ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. అయితే ప్రాధాన్యత గల అంశంపై చాలా మందిలో అవగాహన కొరవడింది.
రక్తదానం మన శరీరానికి ఎలాంటి హాని కలిగించదని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కానీ అది మనకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చుతుంది. రక్తదానం తరువాత పునరుత్పత్తి ప్రారంభం కావడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు ఉంటే తగ్గుతాయి. పెద్ద పేగు, గొంతు క్యాన్సర్లు, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుదలలో కూడా ఉపయోగపడుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మనలను కాపాడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపిస్తుంది.
ఎక్కువగా బరువు పెరిగినట్లయితే, రక్తదానం చేయడం ద్వారా బరువును కోల్పోవచ్చు. దీనితో పాటు రక్తదానం చేయడం వల్ల సత్తువ కూడా పెరుగుతుంది. ఏదైనా ఆరోగ్య ప్రమాదాన్ని నివారించడానికి రక్తదానం చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం అవసరం.
రక్తదానం చేయడం వల్ల మొత్తం శారీరక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. రక్తదానం చేసినప్పుడు, ఎర్ర రక్త కణాలకు ఉత్పత్తి చేసే ప్లీహం సరికొత్త శక్తితో పనిచేయడము ప్రారంభిస్తుంది. రక్త ప్లాస్మా మన రోగ నిరోధక కణాలైన ల్యూకోసైట్లను కూడా పెంచుతుంది. ఇవి చాలా తీవ్రమైన వ్యాధుల నుంచి మనలను రక్షిస్తాయి.
మనం క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే, శరీరంలో ఐరన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. రక్తంలో అధిక స్థ్థాయిలో ఐరన్ ఉంటే రక్త నాళాలను అడ్డుకొంటుంది. రక్త ప్రసరణ దెబ్బతింటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. హెమోక్రోమటోసిస్ (ఐరన్ ఓవర్లోడ్) అనే వ్యాధికి కారణమవుతుంది. రక్తదానం చేయడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి.
రక్తంలో ఇనుము పేరుకుపోకుండా ఉండేందుకు రక్తదానం చాలా మంచి మార్గం. రక్తంలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
రక్తదానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో అతిపెద్ద ఆరోగ్య ప్రయోజనం మానసిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడం. మనం రక్తదానం చేసినప్పుడు, గొప్ప సహాయం చేసామనే మంచి అనుభూతి మనకు కలుగుతుంది. ఇది మనల్ని రీఫ్రెష్ చేయడమే కాకుండా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరోఒక్కరూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్తం అవసరమవుతుంది. ఆ అత్యవసర పరిస్థితుల్లో మనం చేసే రక్తదానం ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు. దీని నుంచి వచ్చే ఆనందం మన మానసిక ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. మానసికంగా మనం చాలా దృఢంగా ఉంటాం.