వికారాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అందరి కంటే ముందున్న చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారానికి స్పందన కరువైంది. ఆశీర్వాద యాత్ర పేరిట ప్రచారం మొదలుపెట్టిన ఆయనకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉన్నది. అసలే క్యాడర్ లేని బీజేపీకి డబ్బులిచ్చినా జనసమీకరణలో స్థానిక నేతలు విఫలమవుతుండడంతో కొండా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో ఎక్కడ యాత్ర నిర్వహించినా 10 నుంచి 20 మందికి మించి రాకపోవడం గమనార్హం.
అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు సభలు, సమావేశాలతో ప్రచారం నిర్వహిస్తుంటే, క్షేత్రస్థాయి ప్రచారంలో బీజేపీ అభ్యర్థి ముందున్నారు. కొండా విశ్వేశ్వర్రెడ్డికి క్షేత్రస్థాయి ప్రచారంలో దూసుకుపోతున్నాననే సంతృప్తి తప్పా.. జనాలు పెద్దగా రాకపోవడంతో ప్రతిచోటా అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు. కొండా ఆశీర్వాద యాత్రలో స్థానికుల కంటే ఆయన దగ్గర పనిచేసే ఉద్యోగులే ఎక్కువగా కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
అయితే ప్రచారానికి వచ్చే కొద్దిపాటి జనాన్ని కూడా నమ్మించేందుకు ఆయన పడరాని పాట్లు పడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మొదటిసారి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ప్రజలు గెలిపించారు. అయినా చేవెళ్ల నియోజకవర్గానికి ఏ ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేకపోయారు. అంతేకాకుండా సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు కొండా ఇంటికెళ్లితే.. అపాయింట్మెంట్ ఉందా అంటూ కోపమై వెనక్కి పంపారని, మరోసారి ఆయనకు ఓటేసేది లేదని ప్రజలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తున్నది.
బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రచారంలో పడరాని కష్టాలు పడుతున్నారు. ఆశీర్వాద యాత్ర చేపట్టిన నాటి నుంచి స్థానిక నేతలు, క్యాడర్ తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఓ వైపు జనాలు రాకపోవడం, మరోవైపు ఉన్న కొద్దిపాటి క్యాడర్లో వర్గపోరు ఉండడంతో ఆశీర్వాద యాత్ర ఎందుకు చేపట్టానని లోలోపల బాధ పడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా అసంతృప్తితోనే యాత్రలో భాగంగా కొందరిపై అందరి ముందే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల యాలాల మండలంలో ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా.. మండుటెండకు రక్షణగా స్థానిక నాయకుడు ఒకరు కాషాయ టోపీ కొండా తలపై పెట్టేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా సదరు నాయకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టినంత పనిచేశారు. పక్కన ఉన్న మరో నాయకుడు టోపీ పెట్టే ప్రయత్నం చేసిన నాయకుడిని కొద్దిసేపు మాట్లాడకు అంటుండగా, కొండా కలుగజేసుకొని తనను మాట్లాడొద్దని తమవాళ్లు అంటున్నారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ వీడియో చూసిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కొండా విశ్వేశ్వర్రెడ్డిలో ఎలాంటి మార్పు రాలేదు, ఆయనను మళ్లీ గెలిపిస్తే ఇక మన పని అంతే అంటూ చర్చించుకుంటున్నారు. అయితే ఆశీర్వాద యాత్రకు జనసమీకరణ కోసం ఎక్కడైతే యాత్ర చేస్తారో అక్కడి స్థానిక నేతకు టోకెన్లు అందుతున్నాయి. యాత్ర షురూ అయిన వెంటనే జనాలకు టోకెన్లు ఇచ్చి ప్రచారం ముగిసిన అనంతరం టోకెన్లు తీసుకొని రూ.200 చొప్పున ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. డబ్బులిస్తున్నా స్థానిక నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కొండా అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు.
బీజేపీకి క్యాడర్ లేకున్నా ఉన్న కొద్దిపాటి నాయకుల్లో రెండు, మూడు గ్రూపులుండడం గమనార్హం. దీంతో ఏ గ్రూపును దగ్గర తీస్తే ఏ గ్రూపు దూరం అవుతుందనే భయంతో కొండా విశ్వేశ్వర్రెడ్డి సతమతమవుతున్నారు. పరిగి నియోజకవర్గంలో మూడు గ్రూపులున్నాయి. ఇటీవల అసెంంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బూనేటి కిరణ్కుమార్ వర్గం, పరమేశ్వర్రెడ్డి వర్గం, కరణం ప్రహ్లాద్రావు వర్గం ఇలా క్యాడర్ లేకున్నా మూడు వర్గాలతోపాటు మూడు వర్గాలకు వేర్వేరుగా కార్యాలయాలు ఉండడం గమనార్హం. మరోవైపు వికారాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుత బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవ రెడ్డితోపాటు మొన్నటి వరకు అధ్యక్షుడిగా పనిచేసిన సదానంద్రెడ్డి గ్రూపులున్నాయి. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో పటేల్ రవిశంకర్ వర్గం, రమేశ్ వర్గానికి చెందిన రెండు గ్రూపులున్నాయి.