బడంగ్పేట, ఫిబ్రవరి 7 : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ , బీజేపీ నాయకులు సర్పంచ్ మంత్రి సంధ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి సబితారెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసిగిపోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ మతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ప్రతి గడపకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు చేరుతున్నాయన్నారు. రాజకీయాలకతీతంగా పనులు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో పాత కొత్త తేడా లేకుండా సమన్వయంతో పనిచేసి మహేశ్వరంలో పార్టీని తిరుగులేని శక్తిగా ఎదగడానికి అందరూ కంకణబద్దులై పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్, సీనియర్ నాయకులు హన్మంత్రెడ్డి, దేవులానాయక్, శివగంగా ఆలయ చైర్మన్ సుధీర్గౌడ్ ఉన్నారు.