పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజారోగ్యానికి పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మేడే కానుకగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం వారు అందుకుంటున్న వేతనానికి అదనంగా రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటిస్తూ తక్షణం అమలయ్యేలా అధికారులను ఆదేశించారు. దీంతో పారిశుధ్య కార్మికులు సంబురాలు చేసుకుంటున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెపారు. ప్రభుత్వ నిర్ణయంతో రంగారెడ్డి జిల్లాలో 7వేల మంది కార్మికులు, వికారాబాద్ జిల్లాలో 2,381 మంది కార్మికులకు ప్రయోజనం కలుగనున్నది. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు పలుసార్లు పెంచింది. మున్సిపల్ కార్మికులకు 2016లో రూ.8300 నుంచి రూ.12 వేలకు, 2022లో రూ.15,600లకు పెంచిన సర్కార్.. ప్రస్తుతం మరో రూ.వెయ్యి పెంపుతో వారి వేతనం రూ.16,600 లకు చేరింది.
-ఇబ్రహీంపట్నం, మే 2
ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం
మరోసారి పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నది. నాలాంటి ఎంతోమంది కార్మికులకు మేలు జరుగతది. పల్లెలు, మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉంచేందుకు ఎండనక, వాననక, రేయినక, పగలనక కష్టపడి పని చేస్తుంటాం. తమ ఇబ్బందులను గుర్తించిన సీఎం సార్ ఇప్పటికే పలుమార్లు వేతనాలు పెంచారు. మరోసారి వెయ్యి రూపాయలు పెంచి కార్మిక కుటుంబాలకు అండగా నిలిచారు. కార్మికులందరం ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
-లక్ష్మయ్య, పారిశుద్ధ్య కార్మికుడు, ఇబ్రహీంపట్నం
బొంరాస్పేట, మే 2 : పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మే డే కానుకగా రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వారు అందుకుంటున్న వేతనానికి అదనంగా రూ. వెయ్యి పెంచుతున్నట్లు .. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘సఫాయన్న నీకు సలాం’ అన్న నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను గుర్తించి వారి సంక్షేమానికి ప్రభు త్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వారికి వేతనాలను అందజేస్తూ సమాజం లో గౌరవప్రదంగా, తలెత్తుకుని జీవించేలా చర్యలు తీసుకుంటున్నది. వేతన పెంపు నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలోని మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 2,381 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రయోజనం కలుగనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పల్లెలు, పట్టణాలు నేడు సుందరంగా, పరిశుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం పారిశుద్ధ్య కార్మికులె. వీరు ప్రతిరోజూ ఉదయాన్నే చీపుర్లు చేతపట్టి వీధులు, రహదారులు, మురుగు కాలువలను శుభ్రం చేస్తున్నారు. దీంతో గ్రామాలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధులు చాలా వరకు తగ్గాయి. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో వీరి సేవలు వెలకట్టలేనివి. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటున్నది. కష్టసుఖాలను తెలుసుకుని పెరిగిన నిత్యావసరాలకు అనుగుణంగా వేతనాలనూ పెంచుతున్నది.
తెలంగాణ ఏర్పాటు తర్వాతే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే పారిశుద్ధ్య కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. అంతకుముందు చాలీచాలని వేతనాలతో బతుకు బండి నెట్టుకొచ్చేవారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు మున్సిపాలిటీల్లోని సఫాయి కార్మికులకు మూడుసార్లు శాలరీలను పెంచింది. మున్సిపాలిటీల్లో పనిచే స్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 2016లో రూ. 8,300గా ఉన్న వేతనాన్ని రూ.12000.. ఆ తర్వాత 2022 జనవరిలో మరోసారి రూ.12,000 నుంచి రూ. 15,600లకు పెంచింది. మేడే రోజున సోమవారం ప్రభుత్వం వారి వేతనాలను మూడోసారి రూ.వెయ్యి పెంచింది. ఈ పెంపుతో మున్సిపాలిటీల్లో పని చేస్తు న్న పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ. 16,600 వేతనం అందనున్నది. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పారి శుద్ధ్య కార్మికులకు తెలంగాణ రాక ముందు రూ.1000-రూ. 2000 వరకు లభించేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత జీవోనంబరు-51 ద్వారా 2020లో వారి వేతనాన్ని రూ.8500 ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు రెండోసారి వారి వేతనాన్ని మరో రూ.1000 పెంచింది. దీంతో పంచాయతీలలో పని చేస్తున్న పా రిశుద్ధ్య కార్మికులు నెలకు రూ.9,500 చొప్పున వేతనాలను అందుకోనున్నారు.
జిల్లాలో 2,381 మంది..
వేతన పెంపు నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 2,381 మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రయోజనం కలుగనున్నది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 453 మంది, పంచాయతీలలో ప్రతి 500 మంది జనాభాకు ఒక పారిశుద్ధ్య కార్మికుడి చొప్పున 566 గ్రామ పంచాయతీల్లో 1,928 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో 181 మం ది, తాండూరులో 186 మంది, పరిగిలో 53 మంది, కొడంగల్ మున్సిపాలిటీలో 33 మంది సఫాయి కార్మికులు పనిచేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలో
ఏడు వేల మందికి ప్రయోజనం
ఇబ్రహీంపట్నం, మే 2 : మే డే సందర్భంగా సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను పెంచటంతో రంగారెడ్డి జిల్లాలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం సంబురాలు జరుపుకొన్నారు. ప్రస్తుతం వారు అందుకుంటున్న వేతనానికి అదనంగా రూ. వెయ్యి పెంచుతున్నట్లు .. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నదని.. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా రూ.15,600 వస్తుండగా.. పెరిగిన వేతనంతో కలిపి రూ.16,600 అందనున్నది. అలాగే, గ్రామ పంచాయతీలలో ప్రస్తుతం రూ.8,500 అందుతుండగా.. పెరిగిన వేతనంతో రూ.9,500 చేరనున్నది. జిల్లాలో దాదాపుగా ఏడు వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు ప్రయోజనం చేకూరనున్నది. ప్రస్తుతం 16 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లున్నాయి. కార్పొరేషన్లల్లో 800 మందికి పైగా.. 16 మున్సిపాలిటీల్లో రెండు వేల మంది వరకు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. అలాగే, జిల్లాలోని 558 గ్రామపంచాయతీలలో 3,682 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ రంగారెడ్డి జిల్లాలోని పారిశుద్ధ్య కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. తమ సేవలను గుర్తించి రూ.వెయ్యి పెంచుతున్నట్లు ప్రకటించడం సంతోషకరమని పేర్కొన్నారు.
వేతనాల పెంపు హర్షణీయం
సఫాయి పనులు చేస్తున్న నాలాంటి పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచి సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. ప్రతిరోజూ గ్రామాలను ఎంతో శుభ్రంగా ఉంచుతున్న మా శ్రమను సీఎం గుర్తించి వేతనాలు పెంచడం హర్షణీయం. వేతనం పెరిగిన సంతోషంలో ఇంకా మంచిగా పనులు చేస్తాం.
-కందనెల్లి నర్సమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు, చౌదర్పల్లి, బొంరాస్పేట మండలం
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
వేతనాలు పెంచి అండగా నిలిచిన సీఎం కేసీఆర్కు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు వేతనాలను పెంచుతూ సమాజంలో గౌరవప్రదంగా, తలెత్తుకుని జీవించేలా చర్యలు తీసుకుంటున్నది.
-దోమ రాజు, పారిశుద్ధ్య కార్మికుడు, చౌదర్పల్లి, బొంరాస్పేట మండలం.
ఆనందంగా ఉంది
వేతనాలు పెంచినందుకు ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. మా కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం వేతనాలను పెంచడం హర్షణీయం. పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నాం. వేతనం రూ. వెయ్యి పెరిగినందుకు మాకు మేలు జరుగుతుంది.
-జింక నర్సమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు, దుద్యాల
పేదల పక్షపాతి సీఎం కేసీఆర్
పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులను గుర్తించి వేతనాన్ని మరో రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరం. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నది. పేదల పక్షపాతి సీఎం కేసీఆర్.
-అమృత నోముల
పారిశుద్ధ్య కార్మికురాలు, ఇబ్రహీంపట్నం మనసున్న మారాజు.. సీఎం సార్
సీఎం సార్ మనసున్న మారాజు. పారిశుద్ధ్య కార్మికుల బాధలు చూసి వేతనాలు పెంచి అండగా ఉంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మేము అడుగకున్నా వేతనాలు జీవితాంతం రుణపడి ఉంటాం.
– ప్రభావతి పారిశుద్ధ్య కార్మికురాలు, తుమ్ములూరు గ్రామం, మహేశ్వరం
పేదలకు అండగా సీఎం..
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పేదల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్తోపాటు పలు రకాల పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వేతనాలను పెంచుతూ సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారు.
– గుడ్డేటి రాములమ్మ, హయత్నగర్
కార్మికుల బాధలు తెలిసిన గొప్ప సీఎం
కార్మికుల బాధలు తెలిసిన గొప్ప సీఎం కేసీఆర్ సార్. తెలంగాణ వచ్చిన తర్వాతే మా బతుకులు మారాయి. మా ఇబ్బందులను గుర్తించి మేము అడుగకున్నా మరోసారి వేతనాలు పెంచిన గొప్ప సార్ కేసీఆర్. పారిశుద్ధ్య కార్మికుల తరఫున ధన్యవాదాలు.
– రేణుక, స్వీపర్, కొండాపూర్