తాండూరు, అక్టోబర్ 30 : బీఆర్ఎస్కు బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని, తాండూరులో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తానని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చెప్పినట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యను ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కలిశారు. తాండూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నావని, నీలాంటి యువతరం సమాజానికి కావాలని ఆర్.కృష్ణయ్య ఎమ్మెల్యేను ప్రశంసించారు. ఎక్కడా లేనివిధంగా తాండూరులో రూ.2కోట్లతో బీసీ భవనాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు.
నియోజకవర్గంలో బీసీల ఓట్లు అధికంగా ఉన్నాయని, ఎవరెన్ని జమ్మిక్కులు చేసినా తాండూరులో రోహిత్రెడ్డి భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని తెలిపారు. పార్టీలకు అతీతంగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రోహిత్రెడ్డి సేవలను గుర్తించి ఆశీర్వదించడం తాండూరు రాజకీయంలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక బీసీ సంఘం నాయకుడు కందుకూరి రాజ్కుమార్తో పాటు బీసీ సంఘం ప్రతినిధులు త్వరలో తాండూరులో రోహిత్రెడ్డి గెలుపు కోసం ప్రచారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీలు, కులమతాలకు అతీతంగా తమకు మద్దతు ప్రకటిస్తూ ఆశీర్వదిస్తున్న బీసీ సంఘం నేతలు, ప్రజలకు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ గెలుపునకు తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ సహకరించాలని కోరారు.