పరిగి, సెప్టెంబర్ 21 : బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడచులకు అందించే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. జిల్లావ్యాప్తంగా 3,46,000 బతుకమ్మ చీరలు పంపిణీకి ప్రతిపాదనలు పంపించగా 2,88,000 చీరలు జిల్లాకు కేటాయించబడ్డాయి. గురువారం మద్గుల్చిట్టెంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి సబితారెడ్డి ప్రారంభించనున్నారు.
జిల్లాలో మూడు గోదాములు ఏర్పాటు చేసి, వివిధ మండలాలకు సరఫరా చేయనుండగా జిల్లావ్యాప్తంగా మూడు గోదాములకు బుధవారం సాయంత్రం వరకు 2,38,000 బతుకమ్మ చీరలు వచ్చాయి. ఇందులో వికారాబాద్ మార్కెట్ కమిటీ గోదాముకు 83,000 చీరలు, నవాబుపేట్ గోదాముకు 80,000 చీరలు, మర్పల్లి మార్కెట్ గోదాముకు 75,000 చీరలు వచ్చాయి. గురువారం జిల్లా స్థాయిలో మంత్రి ప్రారంభించిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభిస్తారు. గ్రామస్థాయి పంపిణీ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేపట్టడం జరుగుతుంది.