న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 13 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. ఉపాధ్యాయ బృందంతో కలిసి బతుకమ్మ పాటలను ఆలపిస్తూ హుషారుగా ఆడిపాడారు.
అనంతరం బతుకమ్మలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. అంతకుముందు పాఠశాలల్లో విద్యార్థినులు నిర్వహించిన కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అట్టహాసంగా నిర్వహించిన వేడుకల్లో ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. నేటి తరం బతుకమ్మ, దసరా పండుగల ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పూలను పూజించే గొప్ప సంస్కృతి మనదని చెప్పారు.