చరిత్ర కండ్ల ముందు కనిపిస్తే ఆ అనుభూతే వేరు. చరిత్రను తెలుసుకునేందుకు ఖండాలు దాటి.. సముద్రాల్లో మునిగేవాళ్లకు లెకేలేదు. అలాంటిది హైదరాబాద్ మహానగరంలో రాజుల కాలం నాటి ఓ బావి ఇప్పుడు వెలుగులోకి వచ్చి అద్భుత క్షేత్రంగా దర్శనమిస్తున్నది. సనత్నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేటలో కొన్ని శతాబ్దాల పాటు సేవలందించి, దశాబ్దాలుగా నిరాదరణకు గురై.. రూపు రేఖలు కోల్పోయిన చారిత్రక మెట్లబావి ఇప్పుడు తెలంగాణ సరారు చొరవతో మళ్లీ జీవం పోసుకున్నది. అంతేకాదు గొప్ప పర్యాటక ప్రాంతంగా మెట్లబావి రూపుదిద్దుకున్నది.
– సిటీబ్యూరో, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ)/బన్సీలాల్పేట్
నిజాం రాజులు తాగునీటి కోసం కట్టించిన బన్సీలాల్పేట మెట్ల బావి రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ చొరవతో పునర్జీవం పోసుకున్నది. ఈ బావి సామర్థ్యం 22లక్షల లీటర్లు. నీళ్లు ఎంత కిందికి వెళ్లినా.. మెట్ల ద్వారా కిందకు దిగి.. కుండ లేదా బిందెతో మంచి నీళ్లు తోడుకోవచ్చు. అయితే కాలక్రమేణా చెత్తా చెదారం నిండిపోయింది. ఈ బావి పునరుద్ధరణ పనులను 2021 ఆగస్టులో ప్రారంభించారు. దాదాపు 5 వందల మెట్రిక్ టన్నుల మట్టి, చెత్తను తొలగించారు. మట్టి తీస్తున్న కొద్దీ పురాతన వస్తువులు బయట పడ్డాయి. ఉపరితలం నుంచి 50 ఫీట్ల లోతు వరకు ఉన్న బావి లోపలి నుంచే ఓ నిరంతర నీటి ఊట ఉంది. ఇది 55 ఫీట్ల కింద నుంచే వస్తున్నట్టు గుర్తించారు. ప్రతి రోజు తెల్లారేసరికల్లా కనీసం 6 ఫీట్ల నీరు ఆ బావిలో చేరుతోందని రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పన రమేశ్ చెప్పారు. ప్రస్తుతం 53 అడుగుల మేర ఊట నీరుతో మెట్లబావి కళకళలాడుతున్నది. బావి చుట్టు పక్కల ప్రాంతాలలో బోర్లన్నీ భూగర్భ జలాలతో నిండుగా ఉన్నాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అసఫ్-జాహీ కాలంలో నిర్మాణం
సికింద్రాబాద్ ప్రజల తాగునీటి కోసం బన్సీలాల్పేటలోని మెట్ల బావిని అసఫ్-జాహీ వంశస్తులు ఆరు అంతస్తుల లోతు, మెట్లు, స్తంభాలతో అద్భుతంగా నిర్మాణం చేశారు. ఊటనీరుతో నిండి మోట ద్వారా నీటిని పైకి లాగడానికి ఏర్పాట్లు కూడా ఉండేవి. ఆంగ్లేయుల కాలంలో సికింద్రాబాద్ పాలనాధికారి, రెసిడెంట్ అధ్యక్షుడు టీహెచ్ కీస్ ఈ బావిని 1933లో పునరుద్ధరించారు. అందుకు సేట్ బన్సీలాల్ అనే వ్యాపారి ఆర్థిక సహకారం అందించారని, అనంతరమే ఆ ప్రాంతానికి బన్సీలాల్పేట్ అని నిలిచిపోయింది.