వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ పట్టణ శివారులో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు జరుగనున్న బండల ఎల్లమ్మ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం నిర్వహించిన రథోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు.
కొడంగల్, ఫిబ్రవరి 3 : పట్టణ శివారులోని బండల ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే జాతరకు భక్తులు పోటెత్తారు. మండల పరిధిలోని భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కుటుంబీకులు పంచామృతం, గంగాజలంతో అమ్మవారికి అభిషేకం చేశారు.
నూతన వస్ర్తాలు, ఆభరణాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. పట్టణంలోని మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించ ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవంలో భాగంగా అమ్మవారిని రథంపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఊరేగింపులో భక్తులు కుంకుమ, పసుపు, గవ్వలను రథంపై చల్లుతూ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణలో జాతర సందర్భంగా మిఠాయిలు, టెంకాయలు, చిన్నారుల ఆట వస్తువుల దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి.