భూసార పరీక్షలతో పంట దిగుబడిని పెంచవచ్చని రైతులకు వివరించేందుకు రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. నేడు ప్రపంచ భూసార పరీక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని 86 రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సదస్సులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరై నూతన సాగు పద్ధతులు, సాగులో సస్యరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు తెలుపనున్నారు. పంట పంటకు నేలలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాషియం తదితర పోషకాలు తగ్గుతూ ఉంటాయని, తగ్గిన పోషకాలను ఎరువుల రూపంలో వాడితే సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు చేసిన తర్వాత ఏ నేలలో ఏ పంట వేయాలో రైతులకు వివరించనున్నారు. రసాయన, సేంద్రియ ఎరువుల వాడకంపై సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.
– ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 4
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 4 : భూసార పరీక్షల ద్వారానే మట్టిని బట్టి పంటలు వేసుకోవడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని రైతుల్లో మరింత నమ్మకాన్ని కలిగించే దిశగా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందిస్తున్నది. అందులో భాగంగానే సోమవారం ప్రపంచ భూసార పరీక్ష దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా అన్ని రైతు వేదికల్లో రైతులతో వ్యవసాయాధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. వచ్చే యాసంగిలో రైతులు వేసుకునే పంటలు.. దానికి అనువైన నేలలు వంటి వాటిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మట్టి నమూనాలను సేకరించే విధానంపై కూడా రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నారు. సేకరించిన మట్టిని ఏ రకంగా పరీక్షలు చేసుకోవాలనే దానిపై కూడా వివరించనున్నారు. మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు జరిపిన తరువాత ఎలాంటి పంటలు వేసుకోవాలి.. దాంతో జరిగే ఉపయోగాలను శాస్త్రవేత్తలు తెలుపనున్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు నిర్వహించిన తరువాతనే ఆయా నేలలను బట్టి కొందరు రైతులు పంటలు వేసుకుంటున్నారు. దీంతో తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలతోపాటు.. పంటలకు వ్యాధులు కూడా ఎక్కువగా సోకడం లేదని అధికారులు నిర్ధారించారు.
భూసారాన్ని పెంపొందించుకోవడం ఇలా..
భూమిలో రోజురోజుకూ సారం తగ్గిపోతుండటంతో పంటలు ఆశించిన రీతిలో రావడంలేదు. దీంతో అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువుల వాడకంపై రైతులు దృషి సారిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకంతో కలిగే అనర్థాలను రైతులకు వివరించి భూసారాన్ని ఎలా పెంపొందించుకోవాలనే దానిపై ఈ సమావేశాల్లో వివరించనున్నారు. ముఖ్యంగా పచ్చిరొట్ట వాడకంతో భూసారాన్ని పెంపొందించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడకంతో కూడా సారాన్ని పెంపొందించుకోవచ్చనే విధానంపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
జిల్లాలో ఒకే రోజు 86 రైతు వేదికల్లో సమావేశాలు
రంగారెడ్డి జిల్లాలో ప్రపంచ భూసార దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో 86 రైతు వేదికల్లో భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి వ్యవసాయ అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, సంబంధిత వ్యవసాయ అధికారులు, రైతులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా యాపంగి పంటల సాగును దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యాసంగిలో వేసే వరి, కూరగాయలు, ఆకుకూరలు ఇతరత్రా పంటల సాగుకు ఏ నేల అనుకులమో.. ఏ నెలలో ఎలాంటి పంటలు వేస్తే అధిక దిగుబడి వస్తుందో రైతులకు వివరించనున్నారు. భూమిలో సారాన్ని ఎలా పెంచుకోవాలి.. సేంద్రియ ఎరువులను ఎలా వాడాలనే దానిపై రైతులకు వివరించనున్నారు.
భూసార పరీక్షలు తప్పనిసరి
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
యాసంగిలో రైతులు వేసుకునే పంటలకు సంబంధించి భూసార పరీక్షలు నిర్వహించిన తరువాతనే పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించి అత్యధిక లాభాలు గడించవచ్చు. భూసార పరీక్షలపై రైతుల్లో మరింత అవగాహన తీసుకురావడానికి జిల్లావ్యాప్తంగా రైతు వేదికల్లో సోమవారం ప్రపంచ భూసార పరీక్షల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సులకు భూసార పరీక్షలకు సంబంధించిన శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు.