కొత్తూరు, నవంబర్ 15 : ఆటో బోల్తా పడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని వై జంక్షన్ వద్ద సోమవారం జరిగింది. కొత్తూరు ఎస్ఐ సయ్యద్ వివరాల ప్రకారం..చంద్రాయగుట్ట నుంచి చెన్నయ్య, యాదమ్మ, చిట్టయ్య, శంకర్ ఆటోలో చౌదరిగూడ వెళ్తునారు. అయితే నేషనల్ హైవే 44 నుంచి కొత్తూరు వైజంక్షన్ వద్దకు రాగానే డ్రైవర్ షేక్ వాహెద్ వేగంగా వచ్చి ఆటోను కొత్తూరు వైపు తిప్పాడు.
దీంతో ఆటో బోల్తాపడింది. ఆటోలో ఉన్న చెన్నయ్య, డ్రైవర్ షేక్ వాహెద్కు తీవ్ర గాయాలయ్యాయి. యాదమ్మ స్వల్పంగా గాయపడింది. ఆ సమయంలో ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని కొత్తూరులోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సయ్యద్ తెలిపారు.