కల్వకుర్తి రూరల్/ఆమనగల్లు/కడ్తాల్, నవంబర్ 30: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 5గంటలకు ఎన్నికల సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించి 7గంటల సమయానికి ఈవీఎం, వీవీప్యాట్లు, మెటీరియల్ సిద్ధం చేశారు. అనంతరం ఓటు వేసేందుకు అధికారులు పోలింగ్ కేంద్రాలను సిద్ధంచేశారు. ఉదయం 7గంటల నుంచి ఓటు వేసేందుకు గ్రామీణ ప్రాంత బారులుతీరారు. నూతనంగా ఓటు హక్కు పొందిన యువతీయువకులు తమ ఓటును వేసేందుకు ఉత్సా హం కనబరచారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా దివ్యాంగుల ఓట్లను వేసుకునేవిధంగా శాఖాధికారులు ప్రత్యేకంగా ట్రైసైకిళ్లు, ఆటోలు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఓటు హక్కు ఉన్న పట్టణవాసులు ఓటును వేసేందుకు పట్టణాల నుంచి తరలిరావడంతో గ్రామా ల్లో పండగ వాతావరణం నెలకొంది. ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు చోటుచేసుకోకుండా కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్ కేంద్రాలను మూసి వేశారు. గతసారి కన్నా ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని ఆర్వో శ్రీను తెలిపారు. గ్రామాల్లో వెబ్ కామ్ టెలికాస్టింగ్, మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
కల్వకురి పోలీస్ సిబ్బంది ప్రత్యేక పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించడంతో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకుగాను హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు తమ గ్రామాలకు చేరుకోవడంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. కొత్తగా ఓటు హక్కును పొందిన యువతీయువకులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7గంటల నుంచి ఓటర్లు బారులు తీరారు.
వృద్ధులకు దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందికలుగకుండా వీల్ చైర్ను ఏర్పాటు చేశారు. ఓటు వేయడానికి వచ్చిన వారి పోలింగ్ స్లిప్తో పాటుగా ఆధార్, పాన్కార్డు లాంటి ఐడీ కార్డులను పరిశీలించాక పోలీసులు ఓటర్లను పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్శాతాన్ని, పరిస్థితులను తెలుసుకునేందుకు రూట్ ఆఫీసర్లు ప్రత్యేక వాహనాలతో పర్యవేక్షించారు. సాయంత్రం ఐదు గంటల్లోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారందరినీ ఓటు వేసేందుకు అనుమతించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వందమీటర్ల వరకు 144 సెక్షన్ విధించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమనగల్లు మండలంలో పోలింగ్ 83.04 శాతం నమోదైందని అధికారులు తెలిపారు.
కల్వకుర్తి నియోజకవర్గంలో పోలింగ్ 83.23 శాతం నమోదైంది. మొత్తం ఏడు మండలాలకుగాను 2,41,762 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,22,963, మహిళలు 1,19,062 ఉన్నారు. 262 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటింగ్ శాతాన్ని ఆర్వో, అధికారులు ప్రతి రెండు గంటలకు ఒకసారి వెల్లడించారు. ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు 5శాతం, 9గంటల నుంచి 11గంటల వరకు 18శాతం, పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు 39.5శాతం, ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు 60.1శాతం, మూడు గంటల నుంచి 5గంటల వరకు 64.05 శాతం నమోదైంది.
వెల్దండ : మండలంలో ఎన్నికల సరళిని కల్వకుర్తి బీఆర్ఎస్ ఇన్చార్జి, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. రాఘాయిపల్లిలో తన ఓటు హ క్కును వినియోగించుకొని, అక్కడ నుంచి చెర్కూర్, వెల్దండ మండలంలో ఓటింగ్ను పరిశీలించారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమైందన్నారు.
ఊర్కొండ, నవంబర్ 30: మండల పరిధిలో గురువారం జరిగిన పోలింగ్లో బొమ్మరాజుపల్లి, ఊర్కొండ, జగబోయిన్పల్లిలో రాత్రి 7గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 17,270 ఓట్లకుగాను 15052 ఓట్లు పోలయ్యాయి. వారిలో మహిళా ఓటర్లు 7,463, పురుషులు 7,589 ఉన్నారు. ఎక్కడా ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్ సజావుగా నిర్వహించారు.