సిటీబ్యూరో, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ రద్దీ ఏర్పడి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిన ముఖ్య అతిథులు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్తో పాటు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకకు కూడా ట్రాఫిక్ చిక్కులు తప్పలేదు. వీళ్ల కన్వాయ్ ఎల్బీ స్టేడియం వెళ్తుండడంతో రవీంద్ర భారతి చౌరస్తా నుంచి ఎల్బీస్టేడియం వరకు రూట్ క్లియర్ చేయలేక ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదే సమయంలో ఎల్బీ స్టేడియానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు వస్తూ ట్రాఫిక్లో చిక్కుకున్నారు. చివరకు ట్రాఫిక్ ముందుకు కదలకపోవడంతో చేసేది లేక సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నడుచుకుంటూ స్టేడియంలోని ప్రమాణ స్వీకార ప్రాంగాణానికి వెళ్లారు. గవర్నర్ కన్వాయ్కి కూడా ట్రాఫిక్ తిప్పలు తప్పలేదు. ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగానే స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినా ఎక్కడి ట్రాఫిక్ అక్కడా జామ్ కావడంతో సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎల్బీస్టేడియంలో ప్రముఖులు ఏర్పాటు చేసే కార్యక్రమాల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఆ కార్యక్రమానికి ఎంత మంది వస్తారు.. వారికి కావాల్సిన పార్కింగ్ ఏర్పాట్లు, ఎక్కడ వాహనాలు ఆగాలి, ఎక్కడ నిలపాలి అనే విషయాలను వివరించడంతో పాటు పక్కా ప్లాన్ చేస్తారు. కానీ ఈ సారి కొత్త ప్రభు త్వం కొలువు తీరనుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతారని అంచనా వేయలేకపోయారు. దీంతో పాటు కొత్త ప్రభుత్వంలో కొలువు తీరే వారి గురించి ఎక్కువగా తెలియకపోవడంతో పోలీసులు భారీ సంఖ్యలో వాహనాలు జిల్లాల నుంచి వస్తాయని అంచనా వేయడంలో లెక్క తప్పారు.
జిల్లాల నుంచి వచ్చే వారు ఎక్కువగా బస్సుల్లో వస్తుంటారు. కానీ ఈ సారి ఎక్కువ మంది కార్లనే ఎంచుకున్నారు. వచ్చిన వారంతా స్టేడియానికి ఇరువైపులా ఉన్న రూట్లలో ఒక పక్కకు పార్కు చేశారు. సాధారణ ట్రాఫిక్ను మళ్లించినా ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఇరువైపులా రాకపోకలకు సంబంధించిన వాహనాలను మళ్లింపు చేపట్టారు. సాధారణ ట్రాఫిక్ ఈ రూట్లో నుంచి రాకపోకలు సాగించడం, వీఐపీల మూమెంట్తో పాటు స్టేడియానికి తరలివచ్చే వాహనాలతో స్టేడియం పరిసరాలన్నీ భారీగా నిండిపోయాయి.
దీంతో పరిస్థితి చేయి దాటి పోవడంతో ట్రాఫిక్ పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఇదిలాఉండగా సాయంత్రం పాఠశాలల నుంచి తమ ఇండ్లకు వెళ్లే విద్యార్థులకు సైతం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. బషీర్బాగ్ చౌరస్తా, ఏఆర్ పెట్రోల్ బంక్, రవీంద్ర భారతి, లక్డీకాపూల్ చౌరస్తాలో దాటేందుకు గంటల సమయంపాటు వాహనదారులు ట్రాఫిక్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రానికి ట్రాఫిక్ రద్దీ తగ్గి యథాస్థితికి వచ్చింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. సిటీ మధ్యలో ఉండే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సమావేశంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు కార్యక్రమమైతే… ఉదయం నుంచే నగరంలోని ఖైరతాబాద్ మార్గం, సోమాజిగూడ నుంచి రవీంద్రభారతి మీదుగా ఎల్బీ స్టేడియం మీదుగా ట్రాఫిక్ సాగింది.
ఉదయం 9గంటల నుంచి ప్రముఖ రాకపోకలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు నగరానికి చేరుకోవడంతోనే ట్రాఫిక్ మొదలైంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు ఎల్బీ స్టేడియం చుట్టూ ఉన్న 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రధాన మార్గాలన్నీ రోడ్లపై వాహనాలు నిండిపోయాయి. ఇక ఉదయం 9గంటల నుంచి శంషాబాద్, బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి బంజారాహిల్స్ రోడ్ నం. 1లోని తాజ్ కృష్ణా హోటల్లో బస ఏర్పాటు చేయడంతో… అక్కడి నుంచి ఎల్బీ స్టేడియం వరకు ఈ రద్దీ కనిపించింది.
సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు చేశారు. గతంలో రెండు సార్లు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పరిమితి సభ్యులు, ప్రముఖులు, ముఖ్య నేతలు, కీలక అధికారుల సమక్షంలోనే జరిగాయి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి కార్యక్రమాన్ని హంగు ఆర్భాటాల నడుమ భారీగా మొత్తంలో జనాలను తరలించి నిర్వహించారు. దీంతో రాష్ట్రంలోని ప్రధాన జిల్లాల నుంచి వాహనాల్లో జనాలను తరలించడంతో ఎల్బీ స్టేడియంకు సమీపంలోనే పార్కింగ్ స్థలాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అయితే కార్యకర్తలు, పార్టీ నాయకులు నేరుగా ఎల్బీ స్టేడియం చుట్టూ ఉన్న మార్గాల్లోనే వాహనాలు నిలిపివేయడంతో… పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుంచి మొదలైన వాహన రాకపోకలు ఎల్బీ స్టేడియం నుంచి కోఠి, గాంధీ భవన్ వరకు కొనసాగింది. దీంతో పాటు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వంటి ప్రముఖులు బంజారాహిల్స్లోని రోడ్ నం. 1లోని హోటల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస కారణంగా… కోర్ సిటీలోనే ట్రాఫిక్ కేంద్రీకృతమైంది.
ఇక హోటల్ నుంచి మొదలుకుంటే కోఠి, గాంధీభవన్ వరకు ఉన్న రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఇదే సమయంలో ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ నియంత్రణలో కొంత మేర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పాటు ప్రముఖ వాహనాలకు రోడ్ క్లియరెన్స్ కారణంగా పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్ చౌరస్తా, లక్డీకాపూర్, రవీంద్రభారతి, టెలిఫోన్ భవన్ సిగ్నల్ వంటి ప్రధాన జంక్షన్ల వద్ద రద్దీ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.
చాలా ప్రాంతాల్లో ప్రముఖ రాకపోకల కంటే ఎక్కువగా సాధారణ కార్యకర్తలు, జిల్లా స్థాయి ముఖ్య నేతల వాహనాలు రావడంతో ట్రాఫిక్పై పర్యవేక్షణ కోల్పోయింది. దీంతో ప్రధాన జంక్షన్ల వద్ద ప్రముఖ వాహనాల వేగం తగ్గిపోయింది. రవీంద్రభారతి వరకు వాహ న రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదు. కానీ అక్కడి నుంచి ఎల్బీ స్టేడియం చేరుకునే మార్గాన్ని పోలీసులు కూడా నియంత్రించలేకపోయారు. ఓవైపు ప్రముఖుల వాహనాలు, మరోవైపు సిటీ జనాల రాకపోకలతో ట్రాఫిక్ నియంత్రణ కొంత గాడి తప్పింది.