తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సాగునీటి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే ఒక మైలురాయి అని, అదే మాదిరిగా ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ పల్లెను సస్యశ్యామలం చేయడమే రాష్ట్ర సర్కార్ లక్ష్యమన్నారు. ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరులో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, మహేశ్రెడ్డి, గ్రంథాలయ సంస్థ వికారాబాద్ జిల్లా చైర్మన్ రాజుగౌడ్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మాట్లాడారు. అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు, చెక్ డ్యాంలను నిర్మించిందన్నారు. ‘మిషన్ కాకతీయ’తో చెరువుల పునరుద్ధరణ జరిగి నీటినిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని చెరువులు, కుంటలు, చెక్ డ్యాముల్లో నీరు పుష్కలంగా ఉండడంతో బంగారు పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు.
రంగారెడ్డి, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి వేడుకలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటేలా జరిగాయి. జిల్లాలో హైదరాబాద్లోని రెండు డివిజన్లతో పాటు, షాద్నగర్, చేవెళ్ల, కల్వకుర్తి డివిజన్లలో సాగునీటి ఉత్సవాలు ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో సంబురంగా కొనసాగాయి. ప్రతి డివిజన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల, కల్వకుర్తిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు, రైతులు, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పోతారంలో జరిగిన సాగునీటి దినోత్సవంలో విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాక ముందున్న పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులను రైతులకు, ప్రజలకు వివరించారు. నాటి పరిస్థితులకు, నేటి పరిస్థితులకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు సవివరంగా చెప్పారు. చెరువులు, కుంటలు, కత్వాలు, చెక్డ్యామ్ల నిర్వహణ, నాడు ఉన్న స్థితిగతులు, నేడు తెలంగాణ ఆవిర్భావం ఉన్న పరిస్థితులను సాగునీటి పారుదల శాఖ అధికారులు ప్రజలు, ప్రధానంగా రైతులకు అర్థమయ్యేలా పండుగ వేదికలపై వివరించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే పరిస్థితులు, నీటి వనరులను పెంపు చేసుకునే పరిస్థితులను వివరించారు. సాగునీటిని, తాగునీటిని, భూగర్భ జలాలను పెంపొందించుకునే వనరులను అభివృద్ధి చేసుకునేలా ప్రజలు, రైతులు, అనధికారులకు అవగాహన కల్పించారు
చేవెళ్ల మండల పరిధి దేవుని ఎర్రవల్లి గ్రామ రెవెన్యూలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సాగునీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సాగునీటి దినోత్సవంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీసీడీ చైర్మన్ మనోహర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. స్థానికంగా జరిగిన వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. షాద్నగర్ పట్టణంలో జరిగిన సాగునీటి దినోత్సవంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ దయానంద్, ఎంపీపీ రఘుమారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, వైస్ ఎంపీపీ సునీత అంధ్యా నాయక్, మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం నియోజకవర్గం పోతారంలో మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ, దివంగత ఇంద్రారెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ అనే పదం పలకడానికి కూడా నాయకులు జంకేవారని, తమ రాజకీయ జీవితం ఎక్కడ అంధకారంలోకి వెళ్తుందోనని భయపడేవారని నాటి స్థితిగతులను గుర్తు చేసుకున్నారు. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ యాసలో సినిమా తీసినా, తెలంగాణ బిడ్డలు హీరోలుగా నటించినా ప్రజాదరణ పొందుతున్నాయని అన్నారు. నేడు రాష్ట్రంలో ప్రతి ఎకరాలో ఏ పంట వేసుకుంటున్నారో అనే లెక్క ప్రభుత్వం వద్ద ఉందని, రైతులకు రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు సూచనలు ఇస్తున్నారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అంటే.. అందరికీ బంగారం ఇవ్వడం కాదని, బంగారు పూత పూయడం కాదని ప్రజలు బాగుపడాలని, ప్రజల బతుకుల్లో మార్పు రావాలని, పలు సంక్షేమ పథకాల గురించి వివరించారు.