వికారాబాద్, జూలై 12 : తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో 11 రకాల చెకప్లు, పరీక్షలు మహిళలకు ఉచితంగా అందిస్తారు. 18 ఏండ్లు నిండిన మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభోత్సవం చేశారు. వికారాబాద్ జిల్లాలో జూన్ 20న ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలో రామయ్యగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తాండూరు నియోజకవర్గంలోని యాలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పరిగి నియోజకవర్గంలోని దోమ పీహెచ్సీలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
24 గంటల్లో రిపోర్టులు
ఈ పథకంతో మహిళలు ప్రతి మంగళవారం ఆరోగ్య కేంద్రానికి వచ్చి 11 రకాల వివిధ సమస్యలపై వైద్యులను సంప్రదించి పరిష్కరించుకుంటున్నారు. మహిళలకు పరీక్షలు చేసిన రిపోర్ట్లు 24 గంటల్లో వారి వారి మొబైల్ ఫోన్లకు సమాచారం అందేలా ప్రభుత్వం ప్రతిపాదనలు తయారు చేసింది. అవసరం ఉన్న చికిత్సల కోసం మహిళలకు వికారాబాద్ ఏరియా దవాఖాన, టీ-హబ్, (రేడియాలజీ)లో చేర్పించి ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తారు. ప్రారంభమై నాలుగు వారాలు అయిపోయింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మూడు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు మహిళలు తరలి వస్తున్నారు.
663 మంది మహిళలు
ఈ పథకాన్ని వికారాబాద్ జిల్లాలో 663 మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. వికారాబాద్ నియోజకవర్గం రామయ్యగూడ పీహెచ్సీలో 221 మంది, తాండూరు నియోజకవర్గం యాలాల పీహెచ్సీలో 219 మంది, పరిగి నియోజకవర్గం దోమ పీహెచ్సీలో 220 మంది మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. వీరిలో 164 మంది మహిళలు వివిధ సమస్యలతో బాధపడుతున్నారని తెలుసుకొని, వారికి వికారాబాద్ ఏరియా దవాఖానలో ఉచితంగా శస్త్రచికిత్సలు అందిస్తున్నారు. ఈ పథకానికి వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు సైతం తమ వంతు బాధ్యతతో పని చేస్తున్నారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మునుపెన్నడు లేని విధంగా సీఎం కేసీఆర్ మహిళల ఆరోగ్య సమస్యలు పరిష్కరించేందుకు ఆరోగ్య మహిళ పథకరం ప్రవేశపెట్టినందుకు అభినందనలు తెలియజేస్తున్నారు.
11రకాల పరీక్షలు …
18 ఏండ్లు నిండిన మహిళలకు ఆరోగ్య మహిళ పథకం ఎంతో ఉపయోగపడుతున్నది. సహజంగా మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలకు 11 రకాల చెకప్లు, పరీక్షలు ప్రభుత్వమే ఉచితంగా నిర్వహిస్తున్నది. ఇందుకు ప్రత్యేకంగా మహిళా డాక్టర్లు ఉంటారు. వారు పరిశీలించి అవసరం ఉన్న రోగులకు చికిత్సలకు రిఫర్ చేస్తారు. పరీక్షలు చేయించుకున్న తర్వాత అవసరం ఉన్న మహిళలకు మందులు, మాత్రలు ఉచితంగా అందజేస్తున్నారు.
పతి మహిళకు మెరుగైన వైద్యసేవలు
జిల్లాలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటున్నాం. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళ డాక్టర్లను నియమించాం. 11 రకాల చెకప్లు చేసి, ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 663 మంది మహిళలు గత నాలుగు వారాల్లో ఆరోగ్య మహిళ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 164 మంది మహిళలు చికిత్సలు చేయించుకునేందుకు వికారాబాద్ ఏరియా దవాఖానకు రిఫర్ చేశాం. అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించాం. చికిత్సల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రత్యేకంగా 102 వాహనాలను సైతం వినియోగించుకుంటున్నాం. వికారాబాద్ ఏరియా దవాఖానలో అన్ని రకాల పరీక్షలకు సరైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రేడియాలజీ, డయగ్నోస్టిక్, తదితర చికిత్సలు చేసేందుకు అందుబాటులో ఉంది.
– సాయిబాబా, జిలా ్ల పీవోఎంఏ మదర్ ప్రోగ్రామ్ ఆఫీసర్
మహిళలు సద్వియోగం చేసుకోవాలి
ప్రతి మహిళపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. మహిళలకు సంబంధించిన సమస్యలను తెలుసుకొని వారికి అవగాహన కల్పిస్తున్నాం. అవసరం ఉన్న మహిళలకు అక్కడే చికిత్సలు చేస్తున్నారు. వారి వివరాలను ఎప్పటికప్పుడు భద్రపరుచుకుంటూ, వారి ఆరోగ్యపరిస్థితిని మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నాం. ఎలాంటి సమస్యలు ఉన్నా వారికి తగ్గట్లుగా వైద్య సిబ్బందితో తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి మహిళ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రభుత్వం కల్పిస్తున్న ఆరోగ్య మహిళ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి.
– సృజన, నేహ, మహిళా వైద్యులు
ఉచితంగా పరీక్షలు చేయడం సంతోషం
కేసీఆర్ ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా బాగుంది. ఇంటి పనులు, పొలం పనులు చేసుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేకపోతున్నాం. దాదాపు 11 రకాల పరీక్షల చేయించుకోవాలంటే హైదరాబాద్, ప్రైవేటు దవాఖాలకు వెళ్లాల్సి వచ్చేది. ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ప్రభుత్వం మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో సమస్యలు పరిష్కరించుకోగలుగుతున్నాం. ఎలాంటి సమస్యలు ఉన్నా డాక్టర్లు పరిష్కరిస్తున్నారు.
– వెంకటమ్మ, ధన్నారం, వికారాబాద్
ఉచితంగా అన్ని రకాల పరీక్షలు
ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్యమహిళ పథకం ఎంతో బాగుంది. వివిధ రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించి రిపోర్టులు అందజేస్తున్నారు. సమస్యలు ఉన్నట్లు తెలిస్తే సంబంధిత దవాఖానలో ఉచితంగా చికిత్సలు దగ్గరుండి చేయిస్తున్నారు. అవసరం ఉన్న రోగులకు ఉచితంగా మందులు సైతం అందజేస్తున్నారు. మహిళా డాక్టర్లు అందుబాటులో ఉండడంతో మహిళల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు.
– లలిత, ధన్నారం, వికారాబాద్
ఉమ్మడి పాలనలో పట్టించుకోలేదు
మహిళల ఆరోగ్యం పట్ల ఉమ్మడి పాలనలోని ప్రభుత్వాలు ఏమాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సంతోషంగా ఉంది. సహజంగా మహిళల్లో వివిధ రకాల సమస్యలకు ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు మందులు అందజేస్తున్నారు. అవసరం ఉన్న మహిళలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య పరీక్షలు సైతం అందించడం అభినందనీయం. కుటుంబ పనులు, పొలం పనులు చేసుకునే మా లాంటి మహిళలకు ఉచితంగా ఈ పథకం ప్రవేశపెట్టినందుకు సీఎం కేసీఆర్కు ధన్నవాదాలు.
– లాలమ్మ, గుడుపల్లి, వికారాబాద్