బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధం
పూర్తైన టెండర్ల ప్రక్రియ.. రూ.928.41 కోట్ల వ్యయం
ఈ నెలాఖరులోగా పనుల ప్రారంభానికి సన్నాహాలు
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్లుగా అభివృద్ధి
46 కిలోమీటర్ల మేర విస్తరణ
ఆరు అండర్పాస్ బ్రిడ్జిలు నిర్మించేందుకు నిర్ణయం
మొయినాబాద్, చేవెళ్ల వద్ద బైపాస్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక
అంగడిచిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్ప్లాజా..
రంగారెడ్డి, మార్చి 14, (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. 46 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డు నిర్మించనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా.. ఈ నెలాఖరులో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.928.41కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రహదారి విస్తరణ నిమిత్తం 350 ఎకరాల మేర భూములను సేకరించనున్నారు. రహదారి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా అండర్పాస్ బ్రిడ్జిలను కూడా నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించారు. మొత్తం ఆరు భారీ, ఎనిమిది చిన్న అండర్పాస్ బ్రిడ్జిలతోపాటు బైపాస్ రోడ్లనూ నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో మొయినాబాద్, చేవెళ్ల వద్ద బైపాస్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేకాకుండా అంగడిచిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్ప్లాజాను ఏర్పాటు చేయనున్నారు.
బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో ప్రారంభించేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో పనులు షురూ చేయడంపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభించే విధంగా కసరత్తు చేస్తున్నారు. అయితే బీజాపూర్ జాతీయ రహదారి వెళ్లే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్లుగా నిర్మించనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతోపాటు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో నిర్మాణం చేపట్టేందుకు జాతీయ రహదారుల శాఖ సమయాత్తమవుతున్నది. అదేవిధంగా భూ సేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు సంబంధిత అధికారులు. మూడేండ్లుగా బీజాపూర్ జాతీయ రహదారిపై అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల, మన్నెగూడ, పరిగి, కర్నాటకలోని బీజాపూర్ వరకు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వారాంతపు సెలవుల్లో అయితే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు అధిక ట్రాఫిక్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా రహదారి చిన్నగా ఉండడం, వాహనాలు పెరగడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, అంతేకాకుండా అత్యవసర సమయాల్లో అంబులెన్స్లకు ట్రాఫిక్ సమస్య ఎదురవుతున్నది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని నాలుగు లేన్ల రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రూ.928.41 కోట్లతో రహదారి విస్తరణ..
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర బీజాపూర్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. దీని కోసం రూ.928.41 కోట్లు ఖర్చు చేయనున్నారు. తొలుత రూ.800 కోట్లతో అంచనాలను రూపొందించినప్పటికీ, తాజా అంచనాల ప్రకారం మరో రూ.128 కోట్లకు పెంచారు. అదేవిధంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ పనులకుగాను 350 ఎకరాల మేర భూములను సేకరించనున్నారు. ఇప్పటికే ఉన్న జాతీయ రహదారుల మాదిరిగా కాకుండా ఎక్స్ప్రెస్ వే తరహాలో బీజాపూర్ జాతీయ రహదారి అందుబాటులోకి రానున్నది. అప్పా జంక్షన్ నుంచి బీజాపూర్ రహదారి ప్రస్తుతం కొన్ని చోట్ల 25 మీటర్లు, మరికొన్ని చోట్ల 30 మీటర్లుగా ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా 60 మీటర్ల మేర రహదారి విస్తరించి నాలుగు లేన్లుగా మార్చనున్నారు.
ఇప్పటికే మన్నెగూడ నుంచి పరిగి, కొడంగల్, బీజాపూర్ వరకు 45 మీటర్ల మేర మూడు లేన్ల రహదారిగా అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు వెళ్లే జాతీయ రహదారి మధ్య ఉన్న గ్రామాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా జాతీయ రహదారిపైకి రాకుండా అండర్పాస్ బ్రిడ్జిలను కూడా నిర్మించనున్నారు. 46 కిలోమీటర్ల పరిధిలో ఆరు భారీ అండర్పాస్ బ్రిడ్జిలను, ఎనిమిది ప్రాంతాల్లో చిన్న అండర్పాస్ బ్రిడ్జిలను నిర్మించి అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాకుండా బైపాస్ రోడ్లను కూడా నిర్మించేందుకు ప్లాన్ చేశారు. రెండు బైపాస్ రోడ్లు కూడా జిల్లాలోనే నిర్మించనున్నారు. మొయినాబాద్ వద్ద 4.35 కిలోమీటర్ల మేర, చేవెళ్ల వద్ద 6.36 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్లను నిర్మించనున్నారు. నాలుగు లేన్ల రహదారిగా విస్తరిస్తున్న దృష్ట్యా టోల్ప్లాజాను కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అంగడిచిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్ప్లాజాను అందుబాటులోకి తీసుకురానున్నారు.
త్వరలో పనులు షురూ..
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించే పనులు త్వరలో షురూ కానున్నాయి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. సంబంధిత హైవేపై రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే విస్తరణ పనులు పూర్తైతే రోడ్డు ప్రమాదాలు తగ్గడం.. పారిశ్రామిక ప్రగతితోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగనున్నది.
– చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి