పరిగి, జూలై 22 : బీఆర్ఎస్ పాలనలో రైతులు పొలంలో పంటలు సాగు చేసి ఎరువుల కోసం ఆటో యజమానికి చెబితే పొలం దగ్గరికే ఎరువుల బస్తాలు వచ్చేవి. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎరువుల కోసం రైతుల పడిగాపులు తప్పకపోవడంతో అందరికీ తెలిసిపోతుందని యాప్లో బుక్ చేసుకోవాలంటూ సర్కారు కొత్త మెలిక పెట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. దుకాణాల్లోనే ఎరువులు లేనప్పుడు యాప్లో ఎలా ఉంటాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. పరిగిలోని దుకాణాల్లో బుధవారం ఏ ఒక్కచోట కూడా యూరియా బస్తాలు లేవని యాప్లో చూపించడం ఇందుకు నిదర్శనం.
ఎల్నినో ప్రభావంతో ఓవైపు వర్షాలు తగ్గిపోయి వేసిన పంటలు చేతికి వస్తాయో లేదో తెలియని ఆందోళనలో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గత నాలుగైదు రోజులుగా వర్షాలు కురవడంతో పంటలకు మేలు జరిగింది. దీంతో ఎరువులు వేస్తే మరింత ఏపుగా పంటలు ఎదుగుతాయని భావించిన రైతులకు నిరాశ తప్పడంలేదు. పరిగి మండలం మిట్టకోడూర్ గ్రామానికి చెందిన వై.దేవమ్మకు 3.13 ఎకరాల భూమి ఉండగా.. మొక్కజొన్న పంట సాగు చేసింది. వర్షాలు కురుస్తుండటంతో మొక్కజొన్నకు యూరియా వేద్దామని ఆమె కుమారుడు తన ఫోన్లో యాప్ వేసుకొని బుక్చేసేందుకు ప్రయత్నించగా.. పరిగిలో గల 28 దుకాణాల్లో ఎక్కడా యూరియా బస్తాల స్టాక్ లేకపోవడం గమనార్హం. సాధారణంగా ఎక్కడో ఒకచోటైనా యూరియా లభిస్తుందని ఆశించగా.. నిరాశ ఎదురైంది.
అసలు యూరియా బస్తాలు ఎప్పుడు వస్తాయని సంబంధిత ఏఈవోను అడుగగా స్టాకు వచ్చినపుడు యాప్లో స్టాకు ఉన్నట్లుగా కనిపిస్తుందని, అప్పుడు బుక్ చేసుకోండంటూ ఉచిత సలహా ఇచ్చారని అన్నదాతలు వాపోయారు. వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో రైతులకు అవసరమైన ఎరువులు స్టాకు ఏర్పాటు చేయాల్సిన వ్యవసాయాధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ఏ ఒక్క దుకాణంలోనూ యూరియా లేదంటే.. ఇక యాప్ ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు స్పందించి ప్రతి నియోజకవర్గంలో బఫర్ స్టాకు ఏర్పాటు చేసి ఎరువుల కొరత లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.