తాండూరు, అక్టోబర్ 14 : బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కడితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు. శనివారం తాండూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తాండూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో తాండూరు నియోజకవర్గంలో రూ.1672.49 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు. రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినట్లు తెలిపారు. తాండూరు పట్టణ అభివృద్ధి పనులకు రూ.1191.86 కోట్లు, తాండూరు మండలంలో అభివృద్ధికి రూ.236.14 కోట్లు, యాలాల మండలంలో అభివృద్ధికి రూ. 97.77 కోట్లు, బషీరాబాద్ మండలంలో అభివృద్ధికి రూ.68.18 కోట్లు, పెద్దేముల్ మండలం, కోట్ పల్లి పరిధిలోని పలు గ్రామాల అభివృద్ధికి రూ.78.54 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మళ్లీ గెలిపించండి.. అందరూ గర్వపడేలా పని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ నేతల అసత్య మాటలను ప్రజలు నమ్మరాదని సూచించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం తాండూరు అన్ని విధాల అభివృద్ధి చెందేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు.
ఒకప్పుడు వానకాలం వచ్చిందంటే పల్లెలు రోగాలతో వణికిపోయేవని, మిషన్ భగీరథ, పల్లెప్రగతి తదితర కార్యక్రమాలతో ఆ పరిస్థితి నేడు లేదన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డులు పరిశుభ్రంగా మారడంతో సీజనల్ వ్యాధులు తగ్గాయని తెలిపారు. ప్రతి ఊరిలో చెత్తసేకరణ ట్రాక్టర్, డంప్యార్డ్, నర్సరీలు, వైకుంఠ ధామాలను నిర్వహిస్తూ పరిశుభ్రతను కాపాడుకుంటున్నామన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీగా మార్చామన్నారు. వారంటీ లేని గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీవని ఎద్దేవా చేశారు. ఆరు దశాబ్దాలు పాలించినా ఏమీ చేయకుండా మళ్లీ ఆరు గ్యారంటీలా..? ఓటుకు నోటు కేసులో దొరికి ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు ప్రజలు నమ్మి మోసపోరాదని సూచించారు. రూ.100 కోట్లకు బీజేపీ నన్ను కొనాలని చూసినా తాండూరు బిడ్డగా అమ్ముడుపోలేదన్నారు. తాండూరు ప్రజలకు సేవకునిగా మరణించేంత వరకు పని చేస్తానన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలతోపాటు డబుల్ బెడ్రూంలను ఇస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీశైల్రెడ్డి, కరుణం పురుషోత్తంరావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప, బీఆర్ఎస్ బషీరాబాద్ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్, యాలాల మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి, కౌన్సిలర్లు శోభారాణి, నీరజ, సంగీత ఠాకూర్, బీఆర్ఎస్ నేతలు నారాయణరెడ్డి, శ్రీనివాస్ చారి, నర్సింహులు, సిద్రాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.