పరిగి, మే 17 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పర్యాటకుల కోసం ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టడంతోపాటు సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థ ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో పెంచడంతోపాటు ఆదాయం వచ్చేలా చూసేందుకు రద్దీగా ఉండే రూట్లలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి అనంతగిరికి ప్రత్యేక బస్సు సర్వీసును ‘అనంతగిరిగుట్ట దర్శిని’ పేరిట నడిపిస్తుంది. ఈ బస్సును మంగళవారం వికారాబాద్లో కలెక్టర్ నిఖిల ప్రారంభించారు.
సందర్శన ఇలా..
ప్రతి శనివారం, ఆదివారం హైదరాబాద్లోని కేపీహెచ్బీ నుంచి ఈ బస్సు ఉదయం 7 గంటలకు బస్సు బయలుదేరి వికారాబాద్ సమీపంలోని అనంతగిరికి చేరుకుంటుంది. అనంతగిరిలో అనంతపద్మనాభస్వామి దర్శనం అనంతరం ప్రయాణికుల మధ్యాహ్న భోజనం తర్వాత బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం, కోట్పల్లి ప్రాజెక్టు సందర్శన తర్వాత తిరిగి హైదరాబాద్కు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు కేపీహెచ్బీకి చేరుకుంటుంది. ఇందుకుగాను పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.150 బస్సు చార్జీలు తీసుకుంటారు. ప్రస్తుతం కేపీహెచ్బీ నుంచి ఈ బస్సు ప్రారంభం కానుండగా.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. వికారాబాద్ డిపోకు చెందిన నలుగైదుగురు ఉద్యోగులతో కూడిన ప్రత్యేక బృందం నగరంలోని పలుచోట్ల ఈ బస్సు సర్వీసుపై విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. అలాగే వాట్సాప్ గ్రూపులు, ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేయనున్నారు.
ఇబ్బంది లేకుండా ప్రయాణం
రాబోయే రోజుల్లో టీఎస్ ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్ ద్వారా సైతం బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ బస్సులో ప్రయాణించేవారికి టిఫిన్, స్నాక్స్, భోజనం కోసం క్యాటరర్ లేదా అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ వారితో మాట్లాడనున్నారు. తద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ భోజన ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.
తక్కువ ఖర్చుతో ప్రత్యేక బస్సు
ప్రయాణికుల సౌకర్యార్థం తక్కువ ఖర్చుతో హైదరాబాద్ కేపీహెచ్బీ నుంచి అనంతగిరికి ప్రత్యేక బస్సును నడిపించేందుకు ముందుకు వచ్చిన ఆర్టీసీ యాజమాన్యాన్ని కలెక్టర్ నిఖిల అభినందించారు. వికారాబాద్ జిల్లా అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి అనంతగిరి కొండలు, కోట్పల్లి ప్రాజెక్టు, అనంత పద్మనాభ స్వామి దేవాలయం, బుగ్గ రామలింగేశ్వరస్వామి పుణ్యక్షేత్రాలని కలెక్టర్ తెలిపారు. వీకెండ్స్లో చాలామంది ఎక్కువ ఖర్చుతో అనంతగిరికి వస్తుంటారన్నారు. కొంతమందికి ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి వారి కోసం ‘అనంతగిరిగుట్ట దర్శిని’ పేరిట ప్రత్యేక బస్సును ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సోలోమన్ రాజు, డీవీఎం జ్యోతి, వికారాబాద్ డిపో మేనేజర్ మహేశ్ పాల్గొన్నారు.
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త
చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రం అనంతగిరిగుట్ట, కోట్పల్లి ప్రాజెక్టు, బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయాల సందర్శనకు ఆర్టీసీ ప్రత్యేక బస్సును నడిపించడం హైదరాబాద్ ప్రజలకు శుభవార్తగా చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్, టీఎస్ ఆర్టీసీ ఎం.డి సజ్జనార్, సిబ్బందికి ఎంపీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.