సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : ఇల్లు ఖాళీ చేయించిందనే కక్షతో ఒక వృద్ధురాలితో పాటు తొమ్మిదేండ్ల చిన్నారిని హత్య చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసును విచారించిన శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. హత్యలకు కారకుడైన దివాకర్ సాహూను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. శనివారం నందిగామ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. నందిగామ ప్రాంతానికి చెందిన ఎర్రగారి పార్వతమ్మ(60) వృత్తిరీత్యా అంగన్వాడీ ఆయా. ఏడేండ్ల క్రితం భర్త, నాలుగేండ్ల క్రితం పెద్ద కుమారుడు చనిపోయాడు. మరో కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో పార్వతమ్మ ఒంటరిగానే నివసిస్తూ, స్థానికంగా ఉన్న బందుకుంట తండాలోని అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నది. ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మ పక్కనే ఉంటున్న తన చెల్లె కొడుకు కృష్ణయ్య కుమార్తె భానుప్రియ(9)ను తోడుగా పెట్టుకుని బాలిక బాగోగులు చూసుకుంటున్నది.
ఇదిలా ఉండగా గత ఏప్రిల్ నెలలో బీహార్ రాష్ర్టానికి చెందిన దివాకర్సాహూ(23) తన భార్య అంజలీదేవితో కలిసి పార్వతమ్మ ఇంటిలో అద్దెకు దిగాడు. తరచూ భార్యాభర్తలు గొడవ పడుతుండడంతో పార్వతమ్మ ఆ దంపతులను ఇటీవల ఇల్లు ఖాళీ చేయించింది. దీంతో పార్వతమ్మపై కక్ష పెంచుకున్న దివాకర్ సాహూ ఎలాగైన పార్వతమ్మను అంతమొందించాలనుకున్నాడు. పార్వతమ్మ ఇంటిలో అద్దెకుంటున్న క్రమంలో ఆమెకు ఎవరూ లేరనే విషయాన్ని గమనించడంతోపాటు వృద్ధురాలి వద్ద డబ్బు, నగలు ఉన్నట్లు గుర్తించాడు. ఈ మేరకు పథకం ప్రకారం పార్వతమ్మ ఇంటికి సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటూ అదును కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో 16న అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో నిద్రలేచిన దివాకర్ కాలకృత్యాలకు వెళ్తున్నట్లు భార్య అంజలికి చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. నేరుగా పార్వతమ్మ ఇంటి కాంపౌండ్వాల్ గోడ దూకి లోపలికి చొరబడిన దివాకర్, చిన్న గేట్ ఆవరణలో నిద్రిస్తున్న పార్వతమ్మను గొంతు పట్టుకుని, ఇటుకతో తలపై మోదాడు. దీంతో వృద్ధురాలు చనిపోయింది. ఈ అలజడితో నిద్రలేచిన చిన్నారి భానుప్రియ గట్టిగా ఏడవడంతో ఇటుకతో చిన్నారి తలపై గట్టిగా కొట్టాడు. చిన్నారి బతికి ఉంటే తనను గుర్తిస్తుందని భావించిన నిందితుడు కత్తితో భానుప్రియ గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. అనంతరం పార్వతమ్మ వద్ద ఉన్న బీరువా తాళాలు తీసుకుని ఇంట్లోకి వెళ్లి అల్మారాలో నుంచి 2 వరుసల బంగారు పుస్తెలతాడు, వంకు, వెండి పట్టీలు, వెయ్యి రూపాయల నగదును దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈమేరకు చిన్నారి భానుప్రియ తల్లి శశికళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఏసీపీ భాస్కర్గౌడ్ పర్యవేక్షణలో శంషాబాద్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణగౌడ్, నందిగామ ఇన్స్పెక్టర్ రామయ్య తమ బృందంతో రంగంలోకి దిగి ఘటనా స్థలంలో విచారణ జరిపారు. ఈ క్రమంలో మృతురాలు పార్వతమ్మ ఇంటిలో గతంలో అద్దెకు ఉన్న దివాకర్పై అనుమానం రావడంతో విచారణ కోసం దివాకర్ అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లగా అదే రోజు దివాకర్ ఇల్లు ఖాళీ చేసినట్లు తేలింది. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడడంతో దివాకర్ కోసం గాలించి పట్టుకుని విచారించగా నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించాడు. జంట హత్యలు జరిగిన గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి, నిందితుడిని పట్టుకున్న శంషాబాద్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణగౌడ్, నందిగామ ఇన్స్పెక్టర్ రామయ్య, ఇతర పోలీసు బృందాన్ని ఈ సందర్భంగా డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు.