కులకచర్ల, డిసెంబర్ 9: ప్రభుత్వ దవాఖానల్లో కాన్పుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చొరవ ఫలిస్తున్నది. ఒక వైపు నాణ్యమైన వైద్యం.. మరోవైపు అమ్మ ఒడి, కేసిఆర్ కిట్, నగదు సాయం వంటి పథకాలు అమలు చేస్తుండడంతో సర్కార్ దవాఖానలకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది. గర్భిణులు వైద్య పరీక్షల కోసం దవాఖానకు రాకపోకలు సాగించేందుకు 102 అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చి ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది.
అంతేకాకుండా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవమైన మహిళకు రూ.2500 విలువ చేసే కేసీఆర్ కిట్తోపాటు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ శివువు అయితే రూ.12వేల ఆర్థికసాయం విడుతలవారీగా అందిస్తున్నది. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు చేయించుకునేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.
రికార్డు స్థాయిలో..
కులకచర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో రికార్డు స్థాయిలో ప్రసవాలు నమోదవుతున్నాయి. ఒకప్పుడు నెలకు 5లోపు ప్రసవాలు మాత్రమే జరుగుతుండగా.. ప్రస్తుతం నెలకు 25 నుంచి 35 వరకు కాన్పులు జరుగుతున్నాయి. మాతా, శిశు మరణాలను తగ్గిస్తూ.. సర్కారు దవాఖనాల్లో కాన్పుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ప్రసవాల సంఖ్య పెరిగింది..
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. నాణ్యమైన వైద్యం, సంక్షేమ పథకాలు అందుతుండడంతో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరిగింది. రానున్న రోజుల్లో కాన్పుల సంఖ్య మరింత పేరిగే ఆవకాశం ఉన్నది. కులకచర్ల పీహెచ్సీలో అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. – మురళీకృష్ణ, వైద్యాధికారి, కులకచర్ల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం
కేసీఆర్ కిట్ ఎంతో ఉపయోగం..
ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ కిట్ పుట్టిన బిడ్డలకు ఎంతో ఉపయోగపడుతున్నది. ముఖ్యంగా కొనుగోలు చేసే శక్తిలేని నిరుపేదలకు వరంగా మారుతున్నది. రూ.2500విలువ చేసే వస్తువులను ఈ కిట్ ద్వారా అందిస్తున్నది. కిట్ అందుకున్న బాలింతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– చంద్రప్రకాశ్, సీహెచ్వో కులకచర్ల దవాఖాన
మరిన్ని వసతులు ఏర్పాటుకు కృషి..
కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందుతున్నది. దీంతో ఇక్కడ రోజురోజుకూ ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సర్కార్ పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నది. మరిన్ని వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం.
– సత్యమ్మ, ఎంపీపీ కులకచర్ల