కొడంగల్, అక్టోబర్ 10: స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ప్రస్తుతం ఉపాధ్యాయులుగా, వైద్యులుగా, సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేసి రిటైర్ కాగా మరి కొంత మంది రాజకీయ, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. దాదాపు 65 సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్న పాఠశాల నేడు కూడా అదే తరహాల్లో ఉపాధ్యాయుల ప్రత్యేక చొరవతో విద్యాబోధన కొనసాగుతున్నది. గతంలో ఈ పాఠశాలకు కర్ణాటకలోని చించోలి తదితర ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి విద్యా భ్యాసం చేసే వారు. ప్రస్తుతం పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న వారు చాలా వరకు స్థానికులే కాకుండా పూర్వ విద్యార్థులు కూడా. దాంతో పాఠశాల అభ్యున్నతికి మరింతగా కృషి చేస్తూ పూర్వ వైభవాన్ని కాపాడుతున్నారు. పాఠశాలలో ఆరవ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తంగా 638ల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రత్యేక కృషితో ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించి విద్యాభాసం కొనసాగుతున్నది. పాఠశాల ఆవరణలో దాదాపు 1500లకు పైగా మొక్కలు నాటి సంరక్షించారు. గతంలో మోడుగా కనిపించే పాఠశాల ఆవరణ నేడు పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్న భోజనానికి పాఠశాల ఆవరణలో కూరగాయలను పండిస్తున్నారు.
తాము చదువుకున్న సరస్వతీ నిలయాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు విద్యాభిమానులు మందుకు వచ్చి పాఠశాలకు ఆయా వసతులను కల్పించారు. పరీక్ష ఫీజు కట్టలేని విద్యార్థులకు ఉపాధ్యాయులు ఫీజులు చెల్లించి వారికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రత్యేక తరగతులు నిర్వహించడం, వెనుబడిన విద్యార్థులపై దృష్టి సారించి వారికి సహకరించి చదువుల్లో ముందుకు సాగే విధంగా చేయూతను అందిస్తున్నారు. ఉపాధ్యాయులు స్వతహాగా ఖర్చులు భరించి పాఠశాల అభ్యున్నతికి పాటుపడటాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ.. అభినందిస్తున్నారు. ఈ పాఠశాలను చూసి ఆయా పాఠశాలలు హరితహారంతో పాటు విద్యాబోధనలో పోటీ పడుతున్నాయి.
విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్గౌడ్ చొరవతో యూత్ సేవా సమితి వారు పాఠశాలకు లక్ష వ్యయంతో 110 బేంచీలకు అవసరమైయ్యే పరికరా లను అందించారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థులైన గత ప్రధా నోపాధ్యాయుడు రాంరెడ్డిలతో పాటు ఉపాధ్యాయులు గోపీనాథ్ నర్సింగ్, ఏసు రత్నం, ఆనంద్రావు, ఉమాలాల్, సంగమేశ్ మరికొంత మంది కలిసి ప్రతి ఒక్కరూ రూ.1000 పోగు చేసుకొని బేంచీల మరమ్మతులతో పాటు బోర్ వేయించారు.
అంజిలప్ప, యాదగిరి, శరాఫ్ శ్రీనివాస్లు రూ.50వేలు పోగు చేసి విద్యార్థులకు అవసరమయ్యే లైబ్రరీ పుస్తకాలను సమకూర్చారు.
ఇంజనీర్ స్వేహ రూ.60వేలతో సైన్స్ ల్యాబ్కు అవసరమైయ్యే పరికరాలను అందజేశారు.
పాఠశాలలో విధులు నిర్వర్తించిన విశ్రాంత ఉపాధ్యాయురాలు శీలాదేవి రూ. 25వేలు ఖర్చు చేసి బోర్ మోటార్ బిగింపజేశారు.
జయేందర్ ఇన్వర్టర్ , రూ. ఆరు వేలతో షఫి డిజిటల్ డిష్ అంటీనా అందజేశారు.
సర్పంచ్ వెంకట్రెడ్డి రూ.25వేల ఖర్చుతో పాఠశాల భవనం ముందు స్టేజీ ఏర్పాటు చేయించారు.
విద్యా సంవత్సరంలో శ్రీ బలభీమసేన గోసేవ ట్రస్ట్ వారి సహకారంతో అవసర్ ఫౌండేషన్ ఎన్జీవో పాట్నర్ వారు క్రియేటింగ్ సోషల్ ఇంపాక్ట్ కింద పాఠశాలకు 12 కంప్యూటర్ ఎక్విప్మెంట్నుతో పాటు ఇన్వర్టర్ అందజేశారు.
చదువుకున్న పాఠశాలకు సేవ చేయడం సంతోషం..
చదువుకున్న పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో విద్యార్థిగా ఉన్న పాఠశాల ఆనాటి గురువులతో పాఠశాలకు ఎంతో వైభవం ఉండేది. అటువంటి వైభవాన్ని కాపాడే దిశగా పూర్వ విద్యార్థిగా కృషి చేస్తున్నా. కొడంగల్ జీడ్పీ ఉన్నత పాఠశాలకు గతంలో ఎంతో పేరు ఉంది. ఇక్కడ చదువుకున్న వారు ఎందరో ప్రభుత్వ శాఖ ల్లో, రాజకీయంగా ఉన్నత శిఖరాల్లో ఉన్నారు. అదేవిధంగా దాతల సహకారంతో విద్యా ర్థులకు చాలా వరకు సదుపాయాలను అందించారు. ప్రభుత్వం మన ఊరు-మన బడితో పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడంతో రానున్న రోజుల్లో ఈ పాఠశాల మరింత అభివృద్ధిని సంతరించుకోనుంది. – ఆనంద్రావు, ఉపాధ్యాయుడు