Cultivation Techniques | ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 12 : వర్షాలు సమృద్ధిగా కురిసి.. భూగర్భజలాలు పెరిగిపోవడంతో బోరు బావుల ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుతున్నది. ఈ పరిస్థితిలో రైతులు ఎక్కువ శాతం వరిసాగు పైనే దృష్టి సారించారు. రైతులంతా ఒకేసారి నారు పోసుకోవడంతో ఒకేసారి నారు ఎదిగి నాటువేతకు వస్తుంది. ఈ సమయంలో రైతులు.. కూలీల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అదునుగా తీసుకుంటున్న కూలీలు.. తమ కూలీ రేట్లను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారు.
దీనికి తోడు రోజురోజుకూ నాట్లు వేసే కూలీల సంఖ్య కూడా తగ్గుతుంది. రైతులు కూలీ రేట్లతో పాటు కూలీల కొరతతో ఇబ్బందులు పడకూడదన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుడుతున్నది. వరి సాగులో నాట్లు వేసే పద్ధతికి స్వస్తి పలుకుతూ.. వెదజల్లే విధానంపై రైతులు దృష్టి సారించేలా అవగాహన కల్పిస్తున్నారు.
అనేక రకాల నాటు వేసే మిషన్లు వచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో రైతులు వాటి వైపు మొగ్గు చూపడంలేదు. పురాతన కాలం నాటి వెదజల్లే పద్ధతి అనుకూలంగా ఉండటంతో ప్రస్తుతం రైతులు ఇదే విధానాన్ని అనురిస్తున్నారు. గత రెండేండ్లుగా ఈ పద్ధతి వెలుగులోకి వస్తుండటంతో జిల్లావ్యాప్తంగా చాలా మంది రైతులు ఈ విధానంపై మొగ్గు చూపుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ వెదజల్లే పద్ధతిలో సాగు విధానం బాగా పెరిగింది.
సాధారణంగా ఎకరా పొలం నాటు వేయాలంటే కూలీలు రూ.3500 నుంచి రూ.4000 వరకు తీసుకుంటారు. వెదజల్లితే ఎకరాకు కేవలం రూ.400 నుంచి రూ.500 ఖర్చు మాత్రమే అవుతుంది. అదీ వెదజల్లే వారికి ఇచ్చే కూలీ. స్వయంగా జల్లుకుంటే ఆ ఖర్చు కూడా ఉండదు. దిగుబడులు ఎకరాకు 35 నుంచి 45 బస్తాల వరకు వస్తున్నాయి. ముందుగా జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక అవగాహన కల్పించి ప్రతి క్లస్టర్లో 50 ఎకరాల చొప్పున వెదజల్లే పద్ధతిలో సాగు చేయించారు.
ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో రైతు రఘువీరారెడ్డి వెదజల్లే పద్ధతిలో సుమారు రెండెకరాల్లో వరి సాగు చేయడం వల్ల మంచి దిగుబడి రావడంతో వ్యవసాయాధికారులు పలువురు రైతులను ఫీల్డ్ విజిటింగ్కు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ఈ విధానం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అమలు చేసేందుకు పలువురు రైతులు ఈ యాసంగి సీజన్లో ముందుకు వచ్చి వెదజల్లే పద్ధతిపై దృష్టి సారిస్తున్నారు.
వెదజల్లడం రైతుకు చాలా తేలికైన పని. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండానే వరి విత్తనాలను జల్లుకోవచ్చు. అన్ని విధానాల్లోకెల్లా ఇదే ఉత్తమమైన విధానం. మంచి అనుభవం ఉన్న వ్యక్తితో జల్లిస్తే మడిలో సమానంగా వరి విత్తనాలు పడి ఎక్కువ పిలకలు పెడుతుంది. వెదజల్లిన దగ్గరి నుంచి ఎరువులు, మందులు కావల్సిన మోతాదులో సరైన సమయంలో అందిస్తే ఆశించిన దిగుబడి వస్తుంది. మా క్లస్టర్ పరిధిలో గతంలో పది మంది రైతులతో వెదజల్లే విధానం సాగు చేయించాను. ఈసారి కూడా మరింతమందికి అవగాహన కల్పించి వెదజల్లే విధానం వైపు రైతుల దృష్టి మరలించేందుకు కృషిచేస్తున్నాం.
– రఘు, ఏఈవో, ఇబ్రహీంపట్నం