రంగారెడ్డి, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ప్రతి సీజన్లోనూ పంటల లెక్కలను పక్కాగా గణిస్తున్న వ్యవసాయ శాఖ ఇకపై ఎరువుల లెక్కలను సైతం ఎప్పటికప్పుడు తేల్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఎరువుల సరఫరా, నిల్వలు, విక్రయాల నిర్వహణకు సంబంధించిన వివరాలు ఇప్పటివరకు కాగితాలపై మాత్రమే నమోదు చేయడంతో పారదర్శకత ఉండేది కాదు.
ఈ క్రమంలో ఎరువుల వివరాలన్నింటినీ పంటల నమోదుకు సంబంధించిన యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లా అధికారి నుంచి మండల స్థాయి వరకు నిత్యం ఎక్కడో ఒక చోట దుకాణాల తనిఖీలను నిర్వహించి జిల్లాలో ఎరువుల విక్రయాలు, నిల్వల వివరాలను నిరంతరం పరిశీలిస్తున్నారు.
ప్రతి సంవత్సరం యాసంగి, వానకాలం సీజన్ల ఆరంభంలోనే ఎరువులకు సంబంధించిన ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేస్తున్నది. ఆ సీజన్కు ఎన్ని టన్నుల ఎరువులు అవసరమో అంచనా వేసి అందు కనుగుణంగా ఎరువులను సిద్ధం చేసి ఉంచుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పక్కా ప్రణాళికతో ఎరువుల కోసం రైతులు పడే ఇబ్బందులు తీరాయి. ఎరువుల సరఫరా, నిల్వలు, విక్రయాల నిర్వహణ లో మరింత పారదర్శకత ఉండేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటున్నది.
ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా సంబంధిత అధికారులు జిల్లాలోని అన్ని ఎరువుల దుకాణాలను సందర్శించి స్టాక్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. మండలాల్లో క్వాలి టీ కంట్రోల్ ఇన్స్పెక్టర్లుగా వ్యవహరిస్తున్న ఏవోలు వారంలో మూడు రోజులపాటు విధిగా ఎరువుల దుకాణాలను సందర్శించాల్సి ఉంటుంది. జిల్లా వ్యవసాయ అధికారితోపాటు, డివిజన్ స్థాయి అధికారులు సైతం నిర్దేశించిన రోజుల్లో దుకాణాలను సందర్శించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. యాప్లో వివరాలను నమోదు చేయడం వల్ల ఎక్కడ స్టాక్ కొరత ఏర్పడనున్నదో? ముందుగానే తెలుసుకొని ముందస్తుగా తగు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నది.
ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియాతోపాటు ఇతర ఎరువుల కొరత లేకుండా జిల్లా వ్యవసాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై నిఘా పెట్టడంతోపాటు ఎరువుల అమ్మకాలు, స్టాక్ వివరాలు పూర్తిగా యాప్లో నమోదు చేయాలని వ్యవసాయ మండల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. యాసంగి సీజన్ చివరి వరకు కూడా రైతులకు ఎరువుల కొరత రాకుం డా చూడడంతోపాటు వచ్చే వానకాలం సీజన్కు ముందే సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.