మంచాల, మే 26 : ఖరీఫ్లో పంటల సాగుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు రైతులు పొలాల్లో దుక్కులను సిద్ధం చేసుకుంటున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల వర్షాలు కురవడంతో.. రైతులు వానకాలం వ్యవసాయ పను లను ప్రారంభించారు. సన్నా చిన్నాకారు రైతులు నాగళ్లు, ట్రాక్ట ర్లతో పొలం బాటపడుతున్నారు. రైతులకు తోడుగా మహిళలు తమ పొలంలో చెత్తాచెదారాన్ని, ముండ్ల కంపలను తొలగించి వాటిని కాల్చివేస్తున్నారు.
మండలంలోని ఆరుట్ల, మంచాల, జాపాల, నోముల, లింగంపల్లితో పాటు పలు గ్రామాల్లో ఎక్కువగా పత్తివేసే రైతులు దుక్కుల్లో ఎరువులు చల్లి దుక్కులు దున్నిస్తున్నారు. అదేవిధంగా రంగాపూర్ నుంచి లోయపల్లి వరకు ఎక్కువగా రైతులు వరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ రైతులు తమ పొలాల్లో తుకం పోసుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నారు. భారీ వర్షాలు కురియగానే మరో మారు దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. అన్నదాతలకు ఎరువులు, విత్తనాల సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ అధికారిణి జ్యోతిశ్రీ తెలిపారు.