శాంతిభద్రతల సంరక్షణే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది. పోలీస్శాఖలో ఖాళీలను భర్తీ చేయడం, కొత్త వాహనాలు కేటాయించడం, ఆధునిక టెక్నాలజీని సమకూర్చడంతో నేరాల నియంత్రణకు కలిసొచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నేరాల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. గత తొమ్మిదేండ్లుగా ప్రతి ఏడాది 10 శాతానికి పైగా నేరాలు తగ్గుముఖం పడుతున్నాయి. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంతో పోలీసులు ప్రజలతో మమేకమయ్యేలా చేసి ప్రజలను శాంతి భద్రతల్లో భాగస్వాములను చేస్తున్నది. సర్కార్ నిధులతోపాటు దాతల సహకారంతో గ్రామగ్రామాన సీసీటీవీలను ఏర్పాటు చేయడంతో చాలావరకు నేరాలకు అడ్డుకట్ట పడింది. నేరాల కట్టడికి సీపీఎస్ పోలీస్ స్టేషన్లు, సైబర్ నేరాల అదుపునకు ఐటీ సెల్, అక్రమ వ్యాపారాల నివారణకు టాస్క్ఫోర్స్ బృందాలు, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నది. రోడ్లు విస్తరణతోపాటు, ట్రాఫిక్ కంట్రోల్ రూంలు, ఆధునిక సిగ్నలింగ్ జంక్షన్ల వంటి చర్యలతో రోడ్డు ప్రమాదాలు సైతం తగ్గుతున్నాయి. 24 గంటలూ ప్రజల రక్షణ కోసం తపిస్తున్న పోలీసుల సేవలను గుర్తిస్తూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్షా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది.
వికారాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో పెను మా ర్పులొచ్చాయి. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగం గా అధునాతన వాహనాలను అందించడంతోపాటు నూతన టెక్నాలజీతో నేరాల కట్టడికి సర్కారు చర్యలు తీసుకున్నది. ప్రధానంగా గత తొమ్మిదేండ్ల కాలంలో జిల్లాలో శాంతిభద్రతలు చాలా బాగున్నాయి. ప్రతి ఏటా పదిశాతానికి పైగా నేరాలు తగ్గుతున్నా యి. ప్రతి పోలీస్స్టేషన్కూ అవసరమైన సిబ్బందిని నియమించడంతోపాటు పాత వాహనాల స్థానంలో కొత్త వాటిని పోలీస్శాఖకు ప్రభుత్వం అందజేసింది. ఎక్కడా ఏ నేరం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారాన్ని చేరవేసేందుకు తీసుకొచ్చిన డయల్ 100తో బాధితులకు సత్వర న్యాయం జరుగుతున్నది. డయల్ 100కు ఫోన్ వచ్చిన ఐదు నిమిషాల్లోపే పోలీసులు సంబంధిత ప్రాంతానికి చేరుకుంటున్నారు. అంతేకాకుండా మహిళలు, అమ్మాయిల భద్రతకు కూడా ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నది. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్, భరోసా కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సైబర్ నేరగాళ్ల పనిపట్టేందుకు ప్రత్యేకంగా ఐటీ సెల్ను ఏర్పాటు చేయడంతోపాటు ప్రజలకు ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కళాజాత బృందాలతో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు కల్తీలతో ప్రజలు అనారోగ్యం బారినపడకుండా ఉండేందుకు జిల్లాలో ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందాల సభ్యులు జిల్లా అం తటా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేశారు. నిర్దేశించిన వేగానికి మించి వెళ్లే వాహనదారులకు జరిమానా విధిస్తుండటంతో ఏటా రోడ్డు ప్రమాదాలు క్రమంగా తగ్గుతున్నాయి. గ్రామాల్లో నేరాలను కట్టడి చేసేందుకు అన్ని గ్రామాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
జిల్లాలో కల్తీల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆరు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లోని సభ్యులు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతం నుంచి వచ్చే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులతో కలిసి దాడులు చేస్తున్నారు. నకిలీ విత్తనాలు, కల్తీ టీ పొడి, వంట నూనె, అల్లం పేస్టులను తయారు చేసే సంస్థలపై దాడులు చేయడంతోపాటు.. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా పెడుతున్నారు.
జిల్లాలోని మహిళలు, అమ్మాయిల రక్షణకు ప్రభుత్వం షీటీమ్స్ను ఏర్పాటు చేసింది. జిల్లాలోని ప్రతి సబ్ డివిజన్నూ ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు మహిళలు, చిన్నపిల్లలపై ఎవరైనా ఈవ్టీజింగ్తో పాటు ఇబ్బందిపెట్టినా సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు నేర తీవ్రతను బట్టి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. అదేవిధంగా మా నవ అక్రమ రవాణాను అరికట్టడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో రాష్ట్రంలోనే జిల్లా ముందు వరుసలో ఉన్నది. 18 ఏండ్ల లోపు బాలబాలికలు ఎక్కడైనా ప్రమాదకర పరిశ్రమల్లో పని చేస్తే వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి బాలబాలికలు మళ్లీ పాఠశాలలకెళ్లెలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా 18 ఏండ్లు దాటిన అమ్మాయిల అదృశ్యం కేసుల్లోనూ ఏహెచ్టీ యూ బృందం ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. అదేవిధంగా ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలతో బాలకార్మికులుగా ఉన్న వారిని తిరిగి బడికి వెళ్లేలా ఆయా శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారు. అత్యాచారం, పోక్సో కేసుల్లో బాధితులకు అం డగా ఉండేందుకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు 100 డయల్కు ఫోన్ వచ్చిన 5-10 నిమిషాల్లోనే పోలీసులు సంబంధిత ప్రాంతానికి చేరుకుంటున్నారు. జిల్లాలో ప్రతి ఏడాది 25-30 వేల వరకు 100 డయల్ ఫోన్ కాల్స్ వస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నేరాలను నియంత్రించడమే లక్ష్యంగా పోలీసులు జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 566 గ్రామ పంచాయతీలుండగా ఇప్పటివరకు దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రజల భద్రతే ప్రధానంగా పోలీసు శాఖ చేపట్టిన నేను సైతం కా ర్యక్రమానికి ప్రజల నుం చి అనూహ్య స్పందన వస్తున్నది. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులు కమ్యూనిటీ సీసీ టీవీల పేరిట అవగాహన కల్పిస్తుండగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏర్పా టు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు నేను సైతం, కమ్యూనిటీ సీసీ టీవీల్లో భాగంగా 5,071 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 2018లో 377 సీసీ కెమెరాలు, 2019లో 764, 2020లో 939, 2021లో 796, 2022లో 2,195 సీసీ కెమెరాలను గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలు, అమ్మాయిల భద్రత కోసం షీటీమ్స్ బృందాలను ఏర్పాటు చేయడంతో చాలావరకు వేధింపులు, ఈవ్టీజీంగ్లు తగ్గాయి. ప్రస్తుతం అమ్మాయి ల వద్దకు పోకిరీలు రావాలంటేనే జంకుతున్నారు. -లలిత, గృహిణి, చైతన్యనగర్, పెద్దేముల్