తాండూరు, సెప్టెంబర్ 30: ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో నియోజకవర్గంలోని రోడ్లు అధ్వానంగా ఉండగా.. సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అద్భుతంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కా ర్ అధికారం చేపట్టిన అనంతరం ప్రజా రవాణా వ్యవస్థకు అధిక ప్రాధాన్యమిచ్చింది. ఇందుకోసం కోట్లాది రూపాయలను వెచ్చించి రోడ్ల నిర్మాణం, వంతెనలను ఏర్పాటు చేస్తున్నది. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామ పంచాయతీల వరకు లింకు రోడ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతుండడంతో పల్లెదారుల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నా యి. ఎక్కడ చూసిన సిమెంట్, తారు రోడ్లు అందంగా దర్శనమిస్తున్నా యి. ముఖ్యంగా ప్రత్యేక నిధులు వెచ్చించి వంతెనలను నిర్మించడంతో ప్రయాణం సాఫీగా సాగుతున్నది.
గతంలో వానకాలం వస్తే చాలు.. వాగులు, చెరువులు పొంగిపొర్లి రోడ్లు వరదకు కొట్టుకుపోయిన పరిస్థితులు కోకొల్లలు. దీంతో ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించేది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చలు జరిపి వాగులు, పెద్ద చెరువులు పొంగిపొర్లి రవాణా స్తంభించే ప్రాంతాల ను గుర్తించి తాండూ రు నియోజకవర్గంలో అవసరం ఉన్న రోడ్లపై వంతెనలను నిర్మించి ప్రజల ఇబ్బందులను తొలగించారు. ము ఖ్యంగా తాండూరు-కొడంగల్ మార్గం లో కాగ్నానదిపై రూ.16.80 కోట్లతో బ్రిడ్జిని నిర్మించడంతో భారీ వర్షం పడినా ప్రయాణం సాఫీ గా జరుగుతున్నది.
అదేవిధంగా బషీరాబాద్ మండలం జీవన్గీ-కరణ్కోట్ మార్గంలో వాగుపై రూ.13.40 కోట్లతో వంతెన, రూ.11.80 కోట్లతో తాండూరు-నారాయణపూర్ వాగుపై, తాండూరు-వికారాబాద్ మార్గంలో రూ.15.30 కోట్లతో , తాండూరు-కోట్పల్లి మార్గంలో రూ.8.90 కోట్లతో వంతెనలు నిర్మించారు. వీటితోపాటు విర్శెట్టిపల్లి-గోనూర్తోపాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని చెరువులపై వంతెనలు నిర్మించారు. బొంకూర్-బిజ్వార్తోపాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించగా..త్వరలోనే పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని ప్రజలు అభినందిస్తూ మద్దతు తెలుపుతున్నారు.