రంగారెడ్డి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : ‘ధరణి’ని తీసేసి ప్రశాంతంగా ఉన్న రైతుల బతుకులను మళ్లా ఆగం చేయాలని కాంగ్రెస్ కంకణం కట్టుకున్నది. పాసు పుస్తకాల్లో పాత పద్ధతిలోనే 36 కాలమ్లను పొందుపరుస్తామని కాంగ్రెస్ నేతలు ఖరాఖండిగా చెపుతున్నారు. తెలంగాణ రాక ముందు ఉన్న పట్వారీ వ్యవస్థను తెస్తామంటున్నారు. ఇదే జరిగితే గోస పడతామని రైతాంగం ఆవేదన చెందుతున్నది. పహాణి కావాలంటే పట్వారీ దగ్గరికి వెళ్తే ఎంతో కొంత పైసలు ముట్టజెప్పాల్సి వచ్చేదని పాత రోజులను గుర్తుకు చేస్తున్నారు. పంట నష్టం రాయాలన్నా.. భూమి రికార్డులు కావాలన్నా అంతా లంచాలమయమేనని రైతులు పేర్కొంటున్నారు. భూమి కొని పట్టా చేసుకోవాలన్నా.. తర్వాత దాన్ని రికార్డుల్లోకి ఎక్కించాలన్నా.. తహసీల్ ఆఫీస్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి తిరిగి ఇబ్బందులు పడ్డామని చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ ధరణిని అందుబాటులోకి తెచ్చాక ఒకప్పటి ఇబ్బందులు తీరి రైతులు కంటినిండా నిద్రపోతున్నామని బీఆర్ఎస్ పాలనను కొనియాడుతున్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకే దగ్గర చేసుకునే వెసులుబాటు కలిగి వ్యయప్రయాసలు తీరాయని రైతాంగం పేర్కొంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం భూములపై పూర్తి హక్కులు కల్పించడంతోపాటు రైతు బంధు సాయం, ధాన్యం కొనుగోళ్ల డబ్బులను రైతుల ఖాతాల్లోనే జమ చేస్తున్నదని సీఎం కేసీఆర్ పాలనను రైతులు కీర్తిస్తున్నారు. ఉన్నదాన్ని తీసుడెందుకని కాంగ్రెస్ పార్టీని రంగారెడ్డి జిల్లా రైతాంగం సూటిగా ప్రశ్నిస్తున్నది. రైతుల భూములను దోచుకునేందుకే ‘భూమాత’ను తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోయి ఉన్నోళ్లెవరూ ధరణిని తీసేస్తామని అనరని, రైతుల పక్షాన నిలబడుతున్న బీఆర్ఎస్కే మా మద్దతు అని రైతాంగం ముక్తకంఠంతో చెబుతున్నది.
సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన ధరణితో భూసమస్యలు తొందరగా పరిష్కారమవుతున్నాయి. గతంలో భూమికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా పైరవీకారులను ఆశ్రయించాల్సి వచ్చేది. రోజూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా గోడును వినిపించుకునేవారుకాదు. ధరణి తీసేయాలని కాంగ్రెస్ నాయకులు చెపుతుంటే విడ్డూరంగా ఉంది. ధరణి పోర్టల్ పేదరైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. కాంగ్రెసోళ్లు మళ్లీ పాతవిధానాన్ని తీసుకువస్తామనడం అవివేకానికి నిదర్శనం. కాంగ్రెస్ను పాతరేసి.. బీఆర్ఎస్ వెంటే ఉంటాం.
– సుజాత, రైతు, పీసీతండా, మంచాల
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకవచ్చిన ధరణి పోర్టల్తో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. ధరణితో రైతుల భూములకు భరోసా వచ్చింది. అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని చెప్పడం కాంగ్రెస్ నాయకుల అవివేకం. ధరణి రద్దయితే మళ్లీ పైరవీకారులు, దళారుల రాజ్యం వస్తుంది. రెవెన్యూ శాఖలో అవినీతిపరులను మళ్లీ తీసుకురావడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలను నమ్మితే గోసపడతాం. ధరణి అలాగే కొనసాగాలంటే మనమంతా బీఆర్ఎస్ వెంటే ఉండాలి.
– శ్రీనూనాయక్, కడ్తాల్
ధరణితో భూరికార్డులు భద్రంగా ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి తీసేసి పాత పద్ధతిలో పట్వారీ వ్యవస్థను తెస్తే మళ్లీ మాలాంటి రైతులు మోసపోతారు. కాంగ్రెస్ ఆలోచనా విధానాన్ని ఎవ్వరూ హర్షించరు. కుయుక్తులు పన్నుతున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదిలేదు.. సచ్చేదిలేదు. ధరణిని తీసుకొచ్చిన బీఆర్ఎస్ వెంటే మేమంతా ఉంటాం.
– రఘుపతిరెడ్డి, రైతు, చేవెళ్ల
బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ను రద్దు చేస్తే రైతుల జీవితాలు ఆగం అవుతాయి. ధరణితో భూములు భద్రంగా ఉంటాయి. రైతులను ఆగం చేయడానికి కాంగ్రెసోళ్లు సిద్ధం అవుతున్నారు. ధరణిని రద్దు చేస్తామనే కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచాలి. రైతుల బాగు కోరే బీఆర్ఎస్కు మనమంతా అండగా ఉందాం.
– వస్పరి బాబయ్య, రైతు, తుర్కయాంజాల్
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్తో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. గతంలో భూముల వివరాలు పహాణీల్లో ఉండటంతో కొంతమంది అధికారుల డబ్బులు తీసుకుని ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరి పేరుపై రాసి అసలైన పట్టదారులను ఇబ్బందులకు గురిచేసేవారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి భూమాత పోర్టల్ను తీసుకువస్తామని చెప్పడం సరికాదు. ఇలాగైతే కాంగ్రెస్ వచ్చేదిలేదు.. సచ్చేదిలేదు. రైతులమంతా బీఆర్ఎస్ వెంటే ఉంటాం.
– కడ్మూరి సత్యం, తిర్మలాపూర్, షాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల కష్టాలు తెలిసి రెవెన్యూ సేవలు సులభతరం అయ్యేందుకు ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. గతంలో రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాఫీగా భూ క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న రైతులను ఇబ్బందులు పెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు పాత రెవెన్యూ విధానాలను తీసుకొస్తాం అంటున్నారు. అలా జరిగితే రైతులకు పాత రోజులు మళ్లీ చవిచూడాల్సి వస్తది. కాంగ్రెస్ను రానివ్వం. సీఎం కేసీఆర్ వెన్నంటే రైతులందరం ఉంటాం.
– మేడికొండ కిష్టయ్య, రైతు, అంతారం, చేవెళ్ల రూరల్
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ధరణి పోర్టల్ను తీసుకువచ్చింది. దీంతో దళారుల ప్రమేయం లేకుండా పావు గంటలోనే భూమి రిజిస్ట్రేషన్ అయిపోతున్నది. రైతుల భూములకు భద్రత కల్పించింది. ఇప్పుడు రైతులంతా వ్యవసాయాన్ని సంతోషంగా చేసుకుంటున్నాం. అదే కాంగ్రెస్ వస్తే వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఖతం చేస్తాం. రైతుల బతుకులు మారాలంటే బీఆర్ఎస్కే మా మద్దతు.
– కె.శ్రీనివాస్, రైతు, బండరావిరాల, అబ్దుల్లాపూర్మెట్
ధరణి పోర్టల్ తొలగించి భూమాత పోర్టల్ పెడితే రెవెన్యూ కార్యాలయాల్లో పైరవీకారుల రాజ్యం ఏర్పడుతుంది. డబ్బులు పెడితేగానీ పనులు కాని పరిస్థితి నెలకొంటుంది. అధికారులు సైతం అవినీతి అక్రమాలకు పాల్పడుతారు. దీంతో నిరుపేదలకు, సన్న, చిన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుంది. డబ్బులుంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. పేదోడి సమస్యలు ఎక్కడివక్కడే నిలిచిపోతాయి. కాంగ్రెస్ ప్రకటించిన భూమాత పోర్టల్ పెడితే గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులకు కష్టాలు తప్పవు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించే కాంగ్రెస్ వచ్చేదిలేదు.. సచ్చేదిలేదు.. అందుకే మేమంతా బీఆర్ఎస్ వెంటే ఉంటాం.
– బ్రహ్మానందరెడ్డి, ఇబ్రహీంపట్నం
బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి చాలా బాగుంది. కాంగ్రెసోళ్లు ఎందుకు దాన్ని తీసేస్తామంటున్నారో అర్థం కావడంలేదు. రైతు బంధును అమలు చేయకుండా ఉండడానికే ధరణిని తొలగిస్తామంటున్నారు. రిజిస్ట్రేషన్కు గతంలో చాలా సమయం పట్టేది. లంచం కూడా ఇవ్వాల్సి వచ్చేది. నేడు మీ సేవలో బుక్ చేసుకుంటే త్వరగా రిజిస్ట్రేషన్ అవుతున్నది. డబ్బులు కూడా ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరంలేదు. ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల. ధరణిని తెచ్చిన సీంఎ కేసీఆర్కే మా ఓటు. కారు గుర్తుకే ఓటు వేస్తాం.
– సునీత, పెంజర్ల, కొత్తూరు
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ధరణి లేకముందు రైతులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ధరణి పోర్టల్ తొలగిస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించడం సిగ్గుచేటు. ధరణితో భూముల అవకతవకలు, అక్రమాలు, అవినీతి తొలగిపోయాయి. సామాన్య రైతులు కూడా తమ పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైరవీకారులను ఆశ్రయించకుండా చేసుకుంటున్నారు. ధరణి తొలగిస్తామంటే ఊరుకునేదిలేదు. అందుకే బీఆర్ఎస్ వెంటే మేమంతా ఉంటాం.
– కాశమల్ల సత్తయ్య, మేడిపల్లి యాచారం