బొంరాస్పేట, మే 18 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. శనివారం మండలంలోని తుంకిమెట్ల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోరాదన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు వెంటవెంటనే చేరవేయాలని ఆదేశించారు.
ధాన్యాన్ని లారీల్లో లోడ్ చేయడానికి కూలీల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. ధాన్యం సేకరించిన రైతుల వివరాలను ఓపీఎంఎస్ ట్యాబ్లలో పొందుపర్చాలని ఆదేశించారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యం తడువకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రాల నిర్వాహకులను లింగ్యానాయక్ ఆదేశించారు. తేమ శాతాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యాన్ని బాగా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్వో రాజేశ్వర్, డీసీఎంఎస్ మేనేజర్ ఎల్లయ్య, కేంద్రం నిర్వాహకులున్నారు.
తాండూరు రూరల్ : రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు కష్టం రాకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులను ఆదేశించారు. తాండూరు మండలం, చెంగోల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆయన వెంట డీసీఎంఎస్ మేనేజర్ ఎల్లయ్య, తహసీల్దార్ తారాసింగ్ ఉన్నారు.
పెద్దేముల్ : అకాల వర్షాల దృష్ట్యా వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడువకుండా ముందు జాగ్రత్తగా టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని, రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు. మండల పరిధిలోని మంబాపూర్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి అపోహలకు గురి కాకుండా, వదంతులు నమ్మకుండా ఉండాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని సేకరించాలని కొనుగోలు కేంద్రం ఇన్చార్జిని ఆదేశించారు. ధాన్యాన్ని లారీల్లో ఎత్తేందుకు వీలుగా కూలీల సంఖ్యను పెంచుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని సేకరించిన రైతుల వివరాలను ‘ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం’ (ఓపీఎంఎస్ ట్యాబ్)లో పొందుపరచాలని తెలిపారు. ధాన్యాన్ని శుభ్రపరచి, తేమ శాతాన్ని పాటించి తీసుకువచ్చేలా రైతులకు సూచనలు చేయాలని ఆదేశించారు. గన్నీ సంచుల కొరత ఉందని, తగినన్ని టార్పాలిన్లు కావాలని రైతులు కలెక్టర్ను కోరగా.. అందుబాటులో ఉంచాలని ఇన్చార్జిని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, తాండూరు డీసీఎంఎస్ మేనేజర్ ఎల్లయ్య, వరి కొనుగోలు కేంద్రం ఇన్చార్జి నజీర్ ఉన్నారు.