రంగారెడ్డి, జనవరి 2 (నమస్తే తెలంగాణ): మంత్రి పిలుపునకు స్పందించి ఓ యువ ఐఏఎస్ అధికారి సరికొత్త ఒరవడిలో కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అంగన్వాడీ పిల్లలకు మ్యాట్లు అందజేసేందుకు మంత్రి సబితారెడ్డికి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ మ్యాట్లు ఇస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, శాలువాల స్థానంలో విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు అందించాలని మంత్రి ఇచ్చిన పిలుపుతో స్వచ్ఛందంగా దాతలు ముందుకు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి సబితారెడ్డి వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్, యువ ఐఏఎస్ అధికారి ప్రతీక్జైన్ తన వంతుగా ముందుకు వచ్చి అంగన్వాడీ పిల్లలకు మ్యాట్లు అందించాలని నిర్ణయించుకొని సోమవారం మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెల్పుతూ వాటిని అందించారు. మ్యాట్లను అంగన్వాడీ పిల్లలకు పంపించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీక్జైన్ను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ప్రజాప్రతినిధులకు ఉపయోగపడే పనులు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ప్రతీక్జైన్ను మంత్రి అభినందించారు.