తొమ్మిదో విడుత హరితహారానికి అవసరమైన మొక్కలను పెంచేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గ్రామానికొకటి లెక్కన జిల్లావ్యాప్తంగా 558 నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు, పండ్లు, నీడను ఇచ్చే మొక్కలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. వచ్చే హరితహారం సమయానికి మొత్తం 55.80లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో నర్సరీల పనులు ఊపందుకున్నాయి. అన్ని గ్రామాల్లోని నర్సరీల్లో బ్యాగుల్లో మట్టి నింపడం పూర్తికాగా, విత్తనాలు వేసే పనులు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో నర్సరీలో పది వేలకు పైగా మొక్కలు పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వన నర్సరీల బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదేకాగా, ప్రతి నర్సరీకీ ఒక సంరక్షకుడిని ఇప్పటికే నియమించారు.
-రంగారెడ్డి, జనవరి 6 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు పచ్చగా ఉండేందుకు, ఆహ్లాదకర వాతావరణం అంతటా విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. గత పాలకుల హయాంలో మోడు వారిన ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు తెలంగాణ సర్కారు ఊరూరా మొక్కలు నాటుతున్నది. తొమ్మిదో విడుత హరితహారంలో భాగంగా జిల్లాలోని 27 మండలాల్లో 558 నర్సరీల్లో మొక్కలను పెంచేందుకు అన్ని రకాలుగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలో ప్రధానంగా పూలు, పండ్లు, నీడను ఇచ్చే మొక్కల పెంపకానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రాధాన్యం ఇస్తున్నది.
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగం, ఉపాధి, పరిశ్రమలు ఇలాంటి ప్రధానమైన అంశాలన్నింటి పైన ఆయన దృష్టి కేంద్రీకరించారు. వృక్ష సంపదను పెంచేందుకు జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల నుంచి మొదలుకొని పట్టణాలు, నగరాలు సైతం పచ్చగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. వర్షాకాల సీజన్లో కోట్లాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని సామూహికంగా ఒక మహా యజ్ఞంలా ప్రభుత్వ, అధికార యంత్రాంగాలు చేపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి ఆయా ప్రాంతాల్లోని రైతులు వారి పొలాల వద్ద మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు.
జిల్లా హరితమయమే లక్ష్యం..
రానున్న జూన్ మాసం నుంచి షురూ కానున్న 9వ విడుత హరితహారం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 558 గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్, వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కలను నాటనున్నట్టు తెలుస్తున్నది. వ్యవసాయ క్షేత్రాలు, కుంటలు, చెరువు గట్ల మీద, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాల్లో, కాంటూరు కందకాల్లో ప్లాంటేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, జాతీయ రహదారుల వెంట దాదాపు 60 లక్షల మొక్కలను నాటాలనే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. దీనికి అనుగుణంగా జిల్లాలోని 27 మండలాల్లో ఒక్కో మండలం చొప్పున 2,22,222 లక్షలకు పైగా మొక్కలను పెంచేందుకు కార్యాచరణ చేపట్టింది. 558 గ్రామ పంచాయతీల్లో వన నర్సరీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒక్కో నర్సరీలో పది వేల మొక్కలకు పైగా పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. కాగా, మొక్కల పెంపకానికి దోహదపడే బ్యాగుల్లో నాణ్యమైన మట్టిని నింపి గింజలు పెడుతున్నారు. మరి కొన్ని నర్సరీ కేంద్రాల్లో ఇప్పటికే మొక్కలు పెరుగుతున్నాయి.
గ్రామ పంచాయతీలదే నర్సరీల బాధ్యత
జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన వన నర్సరీల బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదే. నర్సరీల సంరక్షణకు గాను ఒక్కో నర్సరీకి ఒక్కో వన సంరక్షకుడిని ఇప్పటికే నియమించారు. నాణ్యతతో కూడిన మట్టి సేకరణ, నీటి సదుపాయం, సంచుల్లో గింజలు నాటడం, పూల మొక్కల అంట్లు తెచ్చి పెంచడం, కలుపు తీయడం, అవసరమైతే పెద్ద బ్యాగులకు మొక్కలను మార్చడం లాంటి పనులు గ్రామ పంచాయతీ సిబ్బందితో చేయించాల్సి ఉంటుంది. జనవరి నుంచి జూన్, జూలై వరకు ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించిన లక్ష్యాల మేరకు మొక్కలు పెంచాలి. వర్షాకాలంలో ఈ మొక్కలను నాటించేలా ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు చర్యలు తీసుకుంటారు.
పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలకే ప్రాధాన్యం
మొక్కల పెంపకంలో ప్రధానంగా పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలనే పెంచుతున్నారు. స్థానిక విత్తనాల కలెక్షన్లో భాగంగా స్థానిక విత్తనాలను సేకరించి ఆయా సంచుల్లో పెట్టాలని గ్రామ పంచాయతీలకు అధికారులు సూచించారు. చింత, వేప, రావి, కానుగ వంటి వాటితో పాటు నీడనిచ్చే చెట్లు, నిమ్మ, జామ, సపోటా పండ్ల మొక్కలు, గన్నేరు, గులాబీ, మందార, బటానీ వంటి పూల మొక్కలను పెంచనున్నారు. ఇందుకు సంబంధించిన గింజలను ఆయా గ్రామాల్లో సేకరించాలని గ్రామ పంచాయతీల కార్యదర్శులను ఆదేశించారు.
హరితహారానికి సిద్ధంగా నర్సరీలు
తొమ్మిదో విడుత హరితహారం కార్యక్రమంలో దాదాపు 60 లక్షల మొక్కలను ఆయా నర్సరీల్లో పెంచేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీల్లో మొక్కల బ్యాగులను మట్టితో నింపి గింజలను నాటుతున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు వాటిని పెంచే బాధ్యతను చేపడుతున్నారు. అన్ని మండల కేంద్రాల్లోని అటవీ నర్సరీల్లోనూ మొక్కలను పెంచుతున్నారు.
– ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, రంగారెడ్డి జిల్లా