రంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : కొత్త రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల్లో చలామణి అవుతున్న బోగస్ సభ్యుల ఏరివేతపై దృష్టి సారించింది. ఈ క్రమంలో రంగారెడ్డిజిల్లాలో రేషన్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలన జరుపుతున్నారు. ఇందుకు ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న ఈకేవైసీ ప్రక్రియ ఉపకరిస్తున్నది. జిల్లాలో 5.58 లక్షల వరకు రేషన్ కార్డులు చలామణిలో ఉండగా.. ఇప్పటివరకు ఇంకా మూడు శాతం మంది ఈకేవైసీ చేయించుకోలేదు. దీంతో బోగస్ సభ్యుల సంఖ్య లక్షల్లోనే ఉన్నట్లు తెలుస్తున్నది. బోగస్ల ఏరివేతతో బియ్యం దుర్వినియోగానికి చెక్ పడుతుందని అధికారులు చెబుతున్నారు.
వేలాది క్వింటాళ్ల బియ్యం దుర్వినియోగం
రంగారెడ్డి జిల్లాలో వివిధ రేషన్ కార్డులు 5,58,438 ఉన్నాయి. వీటిలో 18,22,762 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా సివిల్ సప్లయ్ శాఖ 11,562.725 మెట్రిక్ టన్నుల బియ్యం కోటాను కేటాయిస్తూ వస్తున్నది. ఒక్కో వ్యక్తి పేరిట ఆరు కిలోల చొప్పున రేషన్ కార్డుల్లోని కుటుంబ సభ్యులందరికీ ప్రభుత్వం నెలనెలా బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నది. స్థానికంగా లేనివారు, చనిపోయినవారు, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పేరిట ప్రతి నెలా బియ్యం పంపిణీ జరుగుతున్నది. ఈ అక్రమాలను అరికట్టేందుకు బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నప్పటికీ బోగస్ లబ్ధిదారులను గుర్తించడం కష్టంగా మారింది. దీనికి ప్రధాన కారణం రేషన్ కార్డుల్లోని ఎవరైనా సభ్యుడు ఒకరు డీలర్ వద్దకు వెళ్లి వేలిముద్ర వేస్తే సభ్యులందరికీ బియ్యం పంపిణీ జరుగుతున్నది. దీన్ని ఆసరాగా చేసుకుని అనర్హులు కూడా బియ్యం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలా.. రేషన్ దుకాణాల్లో పొందిన బియ్యాన్ని ప్రైవేటు దళారులకు విక్రయిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో ప్రతి నెలా వేలాది క్వింటాళ్ల బియ్యం దుర్వినియోగం అవుతున్నది.
ఈకేవైసీతో అడ్డుకట్ట
రేషన్ కార్డుదారులు ఈకేవైసీని చేయించుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రేషన్ కార్డులోని ప్రతి సభ్యుడు రేషన్ దుకాణానికి వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలి. లేకపోతే వారి కోటా బియ్యం రద్దవుతుందని చెప్పడంతో చాలా మంది ఉరుకులు పరుగులు పెట్టి ఈకేవైసీ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈకేవైసీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. చలామణిలో ఉన్న రేషన్ కార్డుల్లోని 18,22,762 మంది సభ్యులకుగాను గత ఫిబ్రవరి గడువు నాటికి 1,45,088 మంది(92.04 శాతం) ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. మార్చి వరకు మరోసారి గడువు పెంచడంతో ఇప్పటివరకు 97 శాతం మంది ఈకేవైసీ చేయించుకున్నట్లు తెలిసింది. ఈ లెక్కన మిగిలిపోయిన మూడు శాతం అంటే ఈకేవైసీ చేయించుకోవాల్సిన వారు ఇంకా లక్షల్లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రక్రియ ఆధారంగా సివిల్ సప్లయ్ అధికారులు బోగస్ లబ్ధిదారుల ఏరివేతకు సిద్ధమవుతున్నారు. అనర్హులు ఉంటే ఏకంగా రేషన్ కార్డునే రద్దు చేస్తున్నారు. ప్రతి నెలా 20 శాతం మంది బియ్యం తీసుకోకపోగా.. వీరిలో కొందరు ఒక నెల తీసుకుంటూ మరో నెల వదిలేస్తున్నారు. వీరిపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
ప్రభుత్వ మార్గనిర్దేశాలకు అనుగుణంగా..
బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ పూర్తయిన తర్వాతనే కొత్త కార్డులను జారీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సివిల్ సప్లయ్ అధికారుల వద్ద కొత్త రేషన్ కార్డుల కోసం 71,226 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కార్డులో మార్పులు, చేర్పుల కోసం మరో 8,398 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించాక.. మార్పులు, చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అధికారులు 529 దరఖాస్తులను తిరస్కరించారు. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో 24,796 దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వీటిని ఆన్లైన్ చేసి ఉంచారు. ప్రభుత్వం నుంచి మార్గ నిర్దేశాలు వచ్చిన వెంటనే అందుకనుగుణంగా రేషన్ కార్డులను జారీ చేసేందుకు సివిల్ సప్లయ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.