ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 7 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఫార్మాసిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి అనేక ఫార్మారంగ సంస్థలు రావడంతోపాటు ఎంతో అభివృద్ధి జరుగుతుందన్న సదుద్దేశంతో యాచారం, కందుకూరు మండలాల శివారులో ఫార్మాసిటీని గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాలతోపాటు కందుకూరు మండలంలోని ముచ్చర్ల, మీర్ఖాన్పేట తదితర గ్రామాల్లోని 19,330 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించి.. యాచారం మండలంలోని నాలుగు వేల ఎకరాల అసైన్డ్ భూములను సేకరించింది.
అలాగే ఆరువేల ఎకరాల పట్టా భూముల్లో నాలుగు వేల ఎకరాలను.. మిగతా భూములను కందుకూరు మండలంలోని పలు గ్రామాల నుంచి సేకరించింది. ఇందుకోసం రైతులకు అసైన్డ్ భూములకు ఎకరానికి రూ.7.80 లక్షలు, పట్టా భూములకు రూ.16 లక్షల చొప్పున నష్టపరిహారాన్నీ చెల్లించింది. భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతోపాటు ఎకరానికి 120 గజాల చొప్పున ఇండ్ల స్థలాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది.
దీంతో ఈ ప్రాంతానికి చెందిన మెజార్టీ రైతులు పరిహారంతోపాటు ఇండ్ల పట్టాలను తీసుకున్నారు. దీంతో ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలనుకున్న స్థలంలో టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో రోడ్లను ఏర్పాటుచేసి ఫార్మా సంస్థలకు భూములను కేటాయించేందుకు రంగం సిద్ధం కాగా.. తేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఫార్మాసిటీ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో.. ఫార్మాసిటీకోసం భూములిచ్చిన గ్రామాల్లోని రైతులు ఆ పార్టీ ఇచ్చిన హామీని నమ్మి ఏకపక్షంగా అనుకూలంగా ఓట్లువేశారు. కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీపై ఎలాంటి ప్రకటన చేయకపోగా భూములు కోల్పోయిన రైతులకు తిరిగి భూములిప్పిస్తామన్న హామీని కూడా మార్చిపోయింది. దీంతో ఫార్మా ప్రగతి అక్కడే ఆడిపోయింది. మరోవైపు భూములిచ్చిన రైతులు తమ భూములు తమకు వస్తాయో లేదో అన్న అయోమయంలో ఉన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాంతంలో మెగా టౌన్షిప్ను నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించటంతో ఫార్మాసిటీ ఏర్పాటుపై నీళ్లు చల్లినైట్లెంది. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు ఫార్మాసిటీని రద్దుచేసి భూములు కోల్పోయిన రైతులకు తిరిగి ఇస్తామన్న ఆశలూ అండుగంటాయి. ఫార్మాసిటీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమ భూముల్లో టౌన్షిప్ నిర్మించడం ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాచారం, కందుకూరు మండలాల పరిధిలో ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించడంతో… నందివనపర్తి, నజ్దిక్సింగారం, కుర్మిద్ద, తాటిపర్తి, మేడిపల్లి, యాచారం తదితర గ్రామాల్లోని వేలాది ఎకరాలను రియల్ఎస్టేట్ వ్యాపారులు కొని ప్లాట్లుగా మార్చారు. మరోవైపు ఫార్మా అనుబంధ సంస్థల ప్రతినిధులూ భూములను కొనుగోలు చేసి అభివృద్ధి చేశారు. ఇప్పటికే పలు వ్యాపార సంస్థలు ఫార్మాసిటీ పేరు చెప్పి వేలాది ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్లాట్లను కూడా విక్రయించాయి.
అయితే ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు కావడంలేదని తెలియడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు, రియల్ఎస్టేట్ వ్యాపారులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిబట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన టీసీఎస్ తరహాలోనే ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్న ముందుచూపుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. ఫార్మాసిటీకి అనుబంధంగా మేడిపల్లిలో ఇప్పటికే గ్రీన్ఫార్మాసిటీ పోలీసుస్టేషన్ కూడా ఏర్పాటైంది.