షాబాద్, జనవరి 6: ఆరు గ్యారెంటీల పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వరకు అధికారులు గ్రామాలు, పట్టణాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వీటిలో రెండు రోజులు సెలవులు పోగా మిగతా 8రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు గత నెల 30న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2,91,470 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో వంద కుటుంబాలకు ఒక కౌంటర్ను ఏర్పాటు చేసిన అధికారులు ఆయా పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. ఇందుకోసం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, ఎంఈవోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను నియమించింది. పర్యవేక్షకులుగా జిల్లా స్థాయిలో ఆయా శాఖల అధికారులను ప్రభుత్వం నియమించింది.
ప్రతి టీంలోనూ రెవెన్యూ, వ్యవసాయ, విద్య, వైద్య, విద్యుత్, పౌరసరఫరాల శాఖల అధికారులు సభ్యులుగా వ్యవహరించారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రతి పథకానికి లబ్ధిదారుడి ఆధార్కార్డు, రేషన్కార్డు జత చేయాలని అధికారులు సూచించగా, రేషన్కార్డు లేని వారు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రేషన్కార్డు లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించగా, చాలామంది లబ్ధిదారులకు రేషన్కార్డులు లేకపోవడంతో కార్డు నంబర్ అడిగిన చోట లేదు అని రాసి ఇచ్చారు. లబ్ధిదారుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఆన్లైన్లో నమోదు చేయనున్నారు.
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి (ఆమనగల్లు), రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 26 మండలాల్లో 558 గ్రామ పంచాయతీల్ల్లో ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి 2,91,470 దరఖాస్తులు వచ్చాయి. వంద కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున జిల్లాలో మొత్తం 713 కౌంటర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. ప్రతిరోజు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది.
ప్రజాపాలన నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10వేల చొప్పున నిధులను అందజేసింది. మహాలక్ష్మి పథకంలో రూ.2,500 సాయం, రూ.500 గ్యాస్, ఇంటి నిర్మాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, పింఛన్ తదితర పథకాలకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి దరఖాస్తుకు రేషన్కార్డు పెట్టాలనే రూల్ పెట్టడంతో రేషన్కార్డు లేని వాళ్లు తమకు ఈ పథకాలు వస్తాయో లేదో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా రేషన్కార్డులు జారీ చేసిన తర్వాతనే అర్హులకు పథకాలు ఇస్తే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాపాలన ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను అధికారులు ఈ నెల 17లోపు ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 8రోజుల పాటు ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తులను మండల పరిషత్ కార్యాలయాలతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లతో ఆన్లైన్ నమోదు పనులు నిర్వహిస్తున్నారు. ఏ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో అధికారులు తేల్చనున్నారు.