ఖైరతాబాద్, మే 13 : పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న భాగ్యనగరంలో ఆహ్లాదానికి కొదువ లేదు. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే సాగర్ తీరాన ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళా సముద్రపు అనుభూతిని మిగిలిస్తున్నది. ఈ నెల 24న నెక్లెస్రోడ్లోని పీపుల్స్ప్లాజాలో ఏర్పాటు చేసిన ఈ మేళా గ్రేటర్ వాసులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతి ఏడాది ఓ ప్రత్యేకమైన థీమ్తో ఇక్కడ ఏర్పాటు చేస్తున్న మేళాలో ఈ సంవత్సరం సింగపూర్, దుబాయి తరహాలో అండర్ వాటర్ టన్నెల్, భారీ అక్వేరియం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వందలాది రకాల చేపలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పిల్లలు, పెద్దలు ఈ సొరంగాల్లో విహరిస్తూ సెల్ఫీలు దిగుతూ సంబరపడుతున్నారు.
650 రకాల చేపలు.. సమ్మర్ ఉత్సవ్ మేళాలో ఏర్పాటు చేసిన అండర్
వాటర్ టన్నెల్లో ఎనిమిది ఫీట్ల పొడవు, 200 కేజీల బరువు ఉండే అరపైమా చేప ప్రత్యేక ఆకర్షణ. పసిపిక్, హిందూ మహా సముద్రగర్భంలో లభించే పిరానా, రెడ్టేల్ క్యాట్ఫిష్, బ్లాక్, సిల్వర్ షార్క్, స్ట్రింగ్ రే, ఫెథర్ ఫిష్, పికాక్ బాస్, స్నేక్ హెడ్, అలిగేటర్ గార్, అబాబా లాంటి 650 రకాల చేపలను ఈ టన్నెల్లో ఉంచారు. జలచరాలను 180 డిగ్రీల్లో వీక్షించే అవకాశం కల్పించారు. వీటికి తోడు చేనేత ప్రొత్సహించేందుకు హ్యాండ్ లూమ్ ఎక్స్పో, దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వస్ర్తాలు, చేతివృత్తులు, చిన్నారులను ఆకర్షించే జాయింట్ వీల్, బ్రేక్డ్యాన్స్, టోరాటోరా, కొలంబస్, డ్రాగన్ ట్రైన్, బౌన్సర్, టెడ్డీ బేర్, మేరి గోరౌండ్, జంపింగ్, టాయ్ ట్రైన్స్, వెల్ ఆఫ్ డెత్ లాంటి అనేక అమ్యూజ్మెంట్స్ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు హైదరాబాద్ రుచులు, స్నాక్స్, వివిధ రకాల శీతల పానియాలను అందుబాటులో ఉంచారు. అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారు.
ప్రతి ఏడాది ఓ ప్రత్యేక థీమ్తో..
పది సంవత్సరాలుగా సమ్మర్ ఉత్సవ్ మేళాను నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది
కొత్త కాన్సెప్ట్తో ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది దుబాయి, సింగపూర్ దేశాల్లో ప్రాచుర్యం పొందిన అండర్ వాటర్ టన్నెల్, అక్వేరియాలను ఇక్కడ ఏర్పాటు చేశాం. 650 రకాల చేపలను ఈ టన్నెల్లో ఉంచాం. రోజూ మూడు వేల నుంచి ఐదు వేల మంది వీక్షించేందుకు వస్తున్నారు. వీకెండ్స్లో ఆ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం.