40 ఏండ్ల నాటి భవనం.. పాడుబడిన మరుగుదొడ్లు.. అపరిశుభ్ర పరిసరాలు.. అరకొర వసతులు.. ఒకనొక దశలో మూతపడుతుందనుకున్న మోమిన్పేట మండలంలోని చంద్రాయన్పల్లి ప్రాథమిక పాఠశాలకు మన ఊరు-మనబడి కార్యక్రమం పునర్జన్మనిచ్చింది. చక్కటి భవనం, విశాలమైన తరగతి గదులు, కిచెన్ షెడ్డు, తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు వంటి మౌలిక వసతులతో నేడు కొత్తరూపు సంతరించుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది..
ఈ పాఠశాలే కాదు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు ‘మన ఊరు-మన బడి’తో మంచిరోజులొచ్చాయి. వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో భాగంగా మొత్తం 371 స్కూళ్లను ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. ఇందులో 41 బడుల్లో వందశాతం పనులు పూర్తికాగా, త్వరలో ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మొదట నాలుగు పాఠశాలలను ఎంపిక చేసి రూ.2కోట్లతో అందంగా తీర్చిదిద్దారు. ఆ తరువాత తొలి విడుతలో భాగంగా 464 పాఠశాలలను ఎంపిక చేసి పనులను ప్రారంభించారు. ఇందులో 448 స్కూళ్ల కోసం రూ.97.88 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 38 స్కూళ్లలో పనులు పూర్తికాగా.. మరో 16 బడుల్లో పనులు తది దశకు చేరుకున్నాయి. ‘మన ఊరు-మనబడి’లో భాగంగా కొత్తగా ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడంతోపాటు భవనాలకు మరమ్మతులు, అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్ల నిర్మాణం, పెయింటింగ్, ప్రహరీలు, తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
వికారాబాద్, జనవరి 30, (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకొచ్చేందుకుగాను చేపట్టిన ‘మన ఊరు-మన బడి’తో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతు న్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పింస్తుండడంతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుం టున్నాయి. పనులు పూర్తైన పలు పాఠశాలలను ప్రారంభించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నద్ధం చేశారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మొదటి విడుతలో ఎంపిక చేసిన స్కూళ్లలో మండలానికి, మున్సిపాలిటీకి రెండు చొప్పున పాఠశాలలను ఎంపిక చేసి సంబంధిత స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారు. మొదటి విడుతలో ఎంపిక చేసిన స్కూళ్లలో జిల్లావ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద 41 స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా 1054 ప్రభుత్వ పాఠశాలలుండగా వీటిలో మొదటి విడుతలో 371 స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
మొదటి విడుతలో ఎంపికైన స్కూళ్లలో ఉన్నత పాఠశాలలు-111, ప్రాథమికోన్నత పాఠశాలలు-40, ప్రాథమిక పాఠశాలలు-220 పాఠశాలలున్నాయి. వీటికి ఇప్పటివరకు పైలట్ ప్రాజెక్టు కింద 41 స్కూళ్లలో రూ.5 కోట్లతో పనులన్నీ పూర్తి చేశారు. 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని పనులు నిర్వహిస్తున్నారు. తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్బోర్డులు, పెయిటింగ్, ప్రహరీల నిర్మాణం, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
మూతపడే దశ నుంచి ప్రారంభోత్సవం వరకు..
మోమిన్పేట్ మండలం చంద్రాయన్పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసి, పనులు పూర్తి చేశారు. 40 ఏండ్ల కింద నిర్మించిన స్కూల్ శిథిలావస్థకు చేరుకున్నది. ‘మన ఊరు-మన బడి’తో రూపురేఖలు మారి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. చంద్రాయన్పల్లి ప్రాథమిక పాఠశాలకు రూ.14.30 లక్షల నిధులను ప్రభుత్వం ఖర్చు చేసింది. స్కూల్ ప్రహరీ, తరగతుల మరమ్మతులు, కిచ్న్ షెడ్ నిర్మాణం, విద్యార్థినులకు ప్రత్యేకంగా కొత్తగా మరుగుదొడ్డి, నీటి సౌకర్యం, తాగునీటికి ప్రత్యేకంగా నల్లాలు, తరగతి గదులకు డోర్లు, కిటికీలు, ప్రతి గదిలో ప్లోరింగ్ బండలు, విద్యుత్తు సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రతి తరగతి గదిలో నాలుగు ఫ్యాన్లు, నాలుగు ట్యూబ్ లైట్లు, గ్రీన్చాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. విద్యుత్తు పనులకు సంబంధించి రూ.1,46,915లను ఖర్చు చేయగా, తాగునీటికి రూ.43,899లు, తరగతి గదుల మరమ్మతులకుగాను రూ.5,38,318లను ఖర్చు చేశారు. కిచెన్ షెడ్, ప్రహరీ నిర్మాణానికిగాను రూ.7 లక్షలను ఖర్చు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు – మన బడి’తో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మారుతుండడంతో పాటు డిజిటల్ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో ‘మన ఊరు – మన బడి’లో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు పాఠశాలలు ఎంపిక కాగా, తర్వాత 464 పాఠశాలలు మొదటి విడుతలో ఎంపికయ్యాయి. ఎంపికైన వాటిలో 54 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా, మిగతా పాఠశాలల్లో పనులు సాగుతున్నాయి. ప్రహరీలు, టాయిలెట్లు, తరగతి గదుల మరమ్మతు పనులు, వాషింగ్ నల్లాలు, మరుగుదొడ్లు, వంట గదులను నిర్మించారు.
పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు పాఠశాలలు..
‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయి. జిల్లెలగూడ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలు, శివరాంపల్లికి చెందిన ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలు. ఈ పాఠశాలలకు రూ.2 కోట్ల నిధులను వెచ్చించగా, నిర్మాణ పనులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మొదటి విడుతలో 464 పాఠశాలలు ఎంపిక కాగా, అందులో 448 పాఠశాలలకు రూ.97 కోట్ల 88 లక్షలతో నిర్మాణ పనులను జిల్లా యంత్రాంగం చేపట్టింది. కలెక్టర్ అనుమతితో పనులు ప్రారంభమై, తుది దశకు చేరుకున్నాయి. వాటిలో 345 పాఠశాలలకు రూ.30 లక్షలకు లోబడి ఖర్చు చేస్తున్నారు. మిగతా 103 పాఠశాలలకు రూ.30 లక్షలకు పైనే ఖర్చు అవుతున్నది.
మండలానికి రెండు మాడల్ పాఠశాలలు..
‘మన ఊరు – మన బడి’ కింద మండలానికి రెండు మాడల్ పాఠశాలలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేయనున్నది. 27 మండలాలకుగాను 54 మోడల్ పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో ఇప్పటికే వంద శాతం నిర్మాణ పనులనూ పూర్తి చేశారు. 38 పాఠశాలల్లో పెయింటింగ్, ఎలక్ట్రికల్, టాయిలెట్స్, సివిల్ వర్క్స్ కొనసాగుతున్నాయి. మిగిలిన 16 పాఠశాలల్లో చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నా అవి కొనసాగుతున్నాయి. పలు పాఠశాలలకు ప్రహరీలు, తరగతి గదులు, మరమ్మతులతో పాటు కిచెన్ షెడ్లు, తదితర నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 345 పాఠశాలలకు ఇంజినీరింగ్ విభాగం ద్వారా నిర్మాణాలు కొనసాగుతుండగా, 103 పాఠశాలలు టెండర్ల ద్వారా పనులు జరుగుతున్నాయి.
మా ఊరు స్కూల్కు మంచి రోజులు..
‘మన ఊరు-మన బడి’తో మా ఊరు ప్రభుత్వ పాఠశాలకు మంచి రోజులు వచ్చాయి. శిథిలావస్థకు చేరిన స్కూల్ మూతపడుతది అనుకున్నా. అన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయి. స్కూళ్లను బాగు చేయడంపై గతంలో ఏ సర్కారు ఆలోచించలేదు. సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతతో పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందడంతోపాటు కార్పొరేట్కు దీటుగా స్కూళ్లు రూపుదిద్దుకుంటున్నాయి.
– పి.అంజయ్య, సర్పంచ్, చంద్రాయన్పల్లి
38 పాఠశాలల్లో పనులు పూర్తి..
జిల్లాలో 38 పాఠశాలల్లో పనులన్నీ పూర్తయ్యాయి. 16 పాఠశాలల్లో కొన్ని పనులు మాత్రమే పెండింగులో ఉన్నాయి. త్వరలో పనులు పూర్తి చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి కళ వచ్చింది. గత పాఠశాలలకు, ఇప్పటి పాఠశాలలకు చాలా వ్యత్యాసం ఉన్నది. మౌలిక వసతులను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– సుశీందర్ రావు, జిల్లా విద్యాధికారి, రంగారెడ్డి జిల్లా
శాంతినికేతన్లాగా శివరాంపల్లి పాఠశాల..
‘మన ఊరు-మన బడి’లో భాగంగా శివరాంపల్లి జడ్పీహెచ్ఎస్ అధునాతన హంగులతో రూపుదిద్దుకున్నది. కాంపౌండ్లో అడుగు పెట్టగానే శాంతినికేతన్లా కనువిందు చేస్తున్నది. విశాలమైన మైదానం, పచ్చని చెట్లు, సభా వేదిక, చక్కని తరగతి గదులు, మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, గ్రంథాలయం తదితర సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
– కిషన్ నాయక్, ప్రిన్సిపాల్, జడ్పీహెచ్ఎస్, శివరాంపల్లి
పాఠశాలలో 1300 మంది విద్యార్థులు..
శివరాంపల్లి జడ్పీహెచ్ఎస్లో దాదాపు 1300 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ‘మన ఊరు-మన బడి’తో పాఠశాల రూపురేఖలు మారాయి. గతంలో కంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు ఉండడం వల్ల జిల్లాలోనే పాఠశాలను అగ్ర స్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నాం.
– ఎం.మొగులయ్య, స్కూల్ అసిస్టెంట్, జడ్పీహెచ్ఎస్, శివరాంపల్లి
విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది..
మహరాజ్పేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 2010లో రెండు తరగతి గదుల్లో ఐదు తరగతులు కొనసాగేవి. ముగ్గురు ఉపాధ్యాయులు, 56 మంది విద్యార్థులు ఉండేవారు. మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు ఏర్పడ్డాయి. మంజూరైన రూ.6లక్షల 40వేలతో పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాం. ప్రస్తుతం అనూహ్య రీతిలో విద్యార్థుల సంఖ్య పెరిగింది.
– ఎండీ తాహెర్ అలీ, ప్రధానోపాధ్యాయులు, మహరాజ్ పేట్, శంకర్పల్లి (మం)