ఆదిబట్ల, మే 16 : మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. నాగార్జునసాగర్ రహదారి తుర్కయంజాల్లో సోమవారం అర్ధరాత్రి రోడ్డుపై ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలో డీజే ఈవెంట్ను ముగించుకొని సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ వైపు డీజే బాక్సుల లోడుతో డీసీఎం వెళ్తున్నది.
నాగార్జున సాగర్ రహదారి తుర్కయంజాల్ సమీపంలోని ఇండియన్ పెట్రోల్పంపు వద్ద తులిప్స్ హోటల్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ వెళ్లడానికి రోడ్డుపై నిల్చున్న ఇద్దరు వ్యక్తులు డీసీఎంను ఆపారు. రోడ్డుపక్కన నిలిపిన డీసీఎంను వారు ఎక్కుతుండగా మాచర్ల నుంచి ఇంజాపూర్ వైపు సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ వెనుకనుంచి వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జియగూడకు చెందిన డీజే ఆపరేటర్ ఐనోల మహేశ్(బల్లు)(21) , వెంపల్లి మహేశ్(52), నాగర్కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన తుమ్మోజు లక్ష్మయ్య(52), గుంటూరు జిల్లా, పత్తిపాడు మండలం పాత మల్లయ్య పాలెంకు చెందిన నాగసముద్రం సాయిరెడ్డి(22) తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు.
ఎం.అభిలాష్, సురేశ్, శివారెడ్డి, లింగరాజులకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు, మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.