వికారాబాద్, అక్టోబర్ 14 : వికారాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కంపెనీల్లో, సంస్థల్లో ఉద్యోగాల కోసం జిల్లా ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఇదివరకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎంప్లాయిమెంట్ కార్డును రెన్యూవల్ చేసుకోవాల్సి ఉండేది. ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించి ఒకసారి ఎంప్లాయిమెంట్ కార్డు తీసుకుంటే 54 ఏండ్ల వరకు వర్తించేలా చేసింది. 14 సంవత్సరాల పైబడిన వారు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించడం నిరుద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. యువత విద్యార్హత, ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ సంవత్సరం 10 నెలల్లో 8 సార్లు జాబ్ మేళాలు నిర్వహించగా, 334 మంది హాజరయ్యారు. కంపెనీలో ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి, నైపుణ్యం గలవారిని ఎంపిక చేశారు.
జాబ్ మేళాలు ..
వికారాబాద్ జిల్లా ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో 2022 జనవరి నుంచి అక్టోబర్ వరకు 8 సార్లు జాబ్ మేళాలు నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు ఎస్బీఐ కార్డ్స్, అపోలో ఫార్మసీ, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా, విజయ బయో ఫర్టిలైజర్, సుచిత్ర ఇన్ఫ్రాప్రాజెక్ట్, సిటీ మేకర్స్ అండ్ డెవలపర్స్ తదితర కంపెనీల ప్రతినిధులతో 8 సార్లు జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో 334 మంది నిరుద్యోగులు పాల్గొనగా 84 మంది వివిధ కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు. నిరుద్యోగులకు అక్కడే ఇంటర్వ్యూలు నిర్వహించి నైపుణ్యాలు, ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేస్తారు. వారికి ఆఫర్ లెటర్లను అందజేయడం జరుగుతుంది.
ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం..
ఉద్యోగావకాశాలు రాని వారు నిరుత్సాహ పడొద్దు. వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి.
– షేక్ అబ్దుస్ సుభాన్, జిల్లా ఉపాధి కల్పన అధికారి, వికారాబాద్ జిల్లా