ఇబ్రహీంపట్నం, నవంబర్ 30 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 74.82 శాతం పోలింగ్ నమోదైంది. గురువారం జరిగిన శాసనసభ ఎన్నికల పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. నియోజకవర్గంలోని 343 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో 3,27,583 మంది ఓటర్లకు గానూ 2,48,098మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నియోజకవర్గంలోని ఖానాపూర్, నాగన్పల్లి, దండుమైలారం, బండాలేమూర్ లాంటి గ్రామాల్లో చెదురుమదురు సంఘటనలు జరిగాయి. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే తమ స్వగ్రామమైన ఎలిమినేడులో ఓటు హక్కు వినియోగించుకోగా.. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ శేరిగూడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. ఎన్నికల సమయం ముగిసినప్పటికి ఇబ్రహీంపట్నం, కొంగరకలాన్ గ్రామాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లో ఓటుకోసం బారులు తీరారు.
5గంటలలోపు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ప్రతిఒక్కరికి ఎన్నికల అధికారులు ఓటువేసే అవకాశం కల్పించారు. రాత్రి 8గంటల వరకు కూడా కొంగరకలాన్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, అబ్దుల్లాపూర్మెట్, పెద్దఅంబర్పేట్, మంచాల, యాచారం మండలాలు, మున్సిపాలిటీల్లో పర్యటించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చెదురుమదురు సంఘటనలతో లాఠీచార్జీ జరుగటంతో రాచకొండ సీపీ డీఎచ్ చౌహాన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఇబ్రహీంపట్నంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలించారు. ఖానాపూర్ గ్రామంలో లాఠీచార్జీ జరిగిన నేపథ్యంలో ఆయన ఆ గ్రామానికెళ్ల్లి ఘర్షణ విషయమై ఆరాతీశారు. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పోలీసులు మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగు చర్యలు తీసుకున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటువేయటానికి ఓటర్లు పోటెత్తారు. నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న అనేకమంది గ్రామాలకు వచ్చి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనడంతో పోలింగ్శాతం కూడా భారీగా నమోదైంది.
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని 14గ్రామాల్లో గురువారం నిర్వహించిన ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాయపోల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య ఘర్షణ తలెత్తటంతో పోలీసులు జోక్యం చేసుకుని చక్కదిద్దారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పెద్దఅంబర్పేట, నవంబర్ 30: అసెంబ్లీ ఎన్నికలు మున్సిపాలిటీలో ప్రశాంతంగా ముగిశాయి. పెద్దఅంబర్పేటతోపాటు పసుమాముల, కుంట్లూరు, తట్టిఅన్నారం, మర్రిపల్లి గ్రామాల్లో ఉదయం నుంచే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. యువ ఓటర్లు, తొలిసారి ఓటు వేసేందుకు వచ్చినవారు సంతోషం వ్యక్తంచేశారు. ఓటు వేసి హర్షం వ్యక్తంచేశారు. వృద్ధులు, మహిళలు సైతం ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. మరోవైపు, సొంత గ్రామాల్లో ఓటు వేసేందుకు పట్నం నుంచి భారీగా జనం తరలివెళ్లారు. దీంతో విజయవాడ జాతీయరహదారిపై పెద్దఅంబర్పేట వద్ద వాహనాల రద్దీ నెలకొన్నది.
యాచారం : 24 గ్రామ పంచాయతీలకు గాను 59 బూత్లను ఏర్పాటు చేశారు.
అన్ని బూత్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. ముఖ్యంగా ఫార్మాసిటీ గ్రామాలైన మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలలో సైతం ఎన్నికలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రశాంతంగా కొనసాగాయి. పోలింగ్ కేంద్రాల వద్ద సీఐలు సైదయ్య, రామాంజనేయులు భద్రతను ఏర్పాటు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు సులభంగా ఓటు వేసేలా వారికోసం వీల్చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేశారు. యువత అధికంగా ఓటు హక్కను వినియోగించుకున్నారు. హైదరాబాద్ నుంచి గ్రామాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సాగర్ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది.
మంచాల : మండలంలో 65 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవీవీ ప్రసాద్రావు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు, వృద్ధులు, యువకులు బారులు తీరి ఓటును వేశారు. మండలంలోని లోయపల్లిలో 79వ పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించడంతో గంట పాటు ఆలస్యమైంది. సీఐ కాశీవిశ్వనాథ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తుర్కయంజాల్ : మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి తమ ఓట్లను మున్సిపాలిటీ పరిధిలోని తుర్కయంజాల్, తొర్రూర్లో వేశారు.
ఆదిబట్ల : ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మున్సిపల్ పరిధిని ఎంపీ పటేల్గూడలో 131 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో అధికారులు వెంటనే మరో ఈవీఎం ను ఏర్పాటు చేశారు. కొంగరకలాన్ గ్రామంలోని 122,123,124 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు కొంత ఆలస్యంగా పని చేయడంతో ఈ కేంద్రాల్లో రాత్రి వరకు ఓటింగ్ కొనసాగింది.