రంగారెడ్డి, మార్చి 15(నమస్తే తెలంగాణ): జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. కాగా, మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి పరీక్ష నిర్వహించారు. జనరల్ ఇంటర్కు 70,687 విద్యార్థులు, వొకేషనల్ ఇంటర్కు సంబంధించి 3,994 మంది విద్యార్థులు మొత్తంగా 74,681 మంది బుధవారం పరీక్ష రాయాల్సి ఉండగా, ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా జనరల్ ఇంటర్కు సంబంధించి 68,620 మంది, వొకేషనల్ కోర్సులకు సంబంధించి 3,753 మంది పరీక్షలు రాశారు. మొత్తంగా 72,373 మంది జిల్లాలో పరీక్షలకు హాజరయ్యారు. జనరల్ ఇంటర్కు 2,067 మంది, వొకేషనల్ ఇంటర్కు సంబంధించి 241 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 2,308 మంది పరీక్షలకు గైర్హాజరు అయినట్టు తెలుస్తున్నది.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..
సరూర్నగర్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎల్బీనగర్లోని శివాని జూనియర్ కాలేజీల్లో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ హరీశ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు కలెక్టర్ సూచించారు. ప్రతి కేంద్రం వద్ద మహిళా పోలీసు సిబ్బంది విధుల్లో ఉండేలా చూసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్ విద్యాధికారి వెంక్యా నాయక్ ఉన్నారు.
వికారాబాద్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష బుధవారం సజావుగా జరిగింది. జిల్లాలో 30 సెంటర్లు ఉండగా 9,491 మంది విద్యార్థులకు 9,100 మంది హాజరయ్యారు. 391 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష కొనసాగింది. వికారాబాద్ పట్టణంలో 9 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ైప్లెయింగ్ స్కాడ్ 1 బృందం, చెకింగ్ స్కాడ్ 2 బృందాలు, నోడల్ ఆఫీసర్ ఒకరు పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వికారాబాద్ సంఘం లక్ష్మీబాయి పాఠశాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించారు. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. మొదటి రోజు సెకండ్ ల్యాంగ్వేజ్ పరీక్ష సజావుగా రాశారు. విద్యార్థులు ఎవరూ మాల్ ప్రాక్టీస్కు పాల్పడలేదు. జనరల్ విద్యార్థులు 8,064 మందికి గాను 7,752 మంది హాజరయ్యారు. 312 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 1,427 మందికి గాను 1,348 మంది హాజరు కాగా, 79 మంది గైర్హాజరయ్యారు. ఒక్కరూ డిబార్ కాలేదని నోడల్ ఆఫీసర్ శంకర్నాయక్ తెలిపారు.