రంగారెడ్డి, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): ఆదివాసీ గిరిజనుల ఆత్మ గౌరవం ఉట్టి పడేలా రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, మహేశ్వరం, షాద్నగర్లలో నూతన బంజారా భవనాల నిర్మాణానికి రూ.2 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతిని ప్రదర్శించేందుకు, సభలు, సమావేశాలు, సమ్మేళనాలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వం వీటిని నిర్మించాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు. గతంలో స్థానిక గిరిజనుల వినతి మేరకు వీటిని మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆదివాసీల గిరిజన సంస్కృతికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని, అందులో భాగంగానే ఈ నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.