రంగారెడ్డి, నవంబరు 15 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో 54 మంది నిలిచారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేనాటికి 17 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి 28 మంది పోటీపడుతున్నారు. నామినేషన్ల స్క్రూట్నీ నాటికి ఈ నియోజకవర్గంలో 35 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ఏడుగురు పోటీ నుంచి తప్పుకున్నారు. చేవెళ్ల అసెంబ్లీ బరిలో నుంచి ముగ్గురు తప్పుకోవడంతో 12 మంది, షాద్నగర్ అసెంబ్లీ బరిలో నుంచి ఏడుగురు తప్పుకోవడంతో 14 మంది రంగంలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబల్స్గా బరిలో నిలిచినప్పటికీ చివరకు బరిలో నుంచి తప్పుకున్నారు. చేవెళ్ల అసెంబ్లీలో కాంగ్రెస్ రెబల్గా ఉన్న వసంతం పోటీ నుంచి తప్పుకున్నారు. షాద్నగర్లో కాంగ్రెస్ రెబల్గా ప్రవీణ్తోపాటు ఆయన భార్య నామినేషన్లు వేశారు. బుజ్జగింపులు, చర్చల అనంతరంపోటీ నుంచి తప్పుకున్నారు. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దండెం రాంరెడ్డి పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తున్నది. షాద్నగర్ బీజేపీ అభ్యర్థిగా అందె బాబయ్య పోటీలో ఉండగా.. అదే పార్టీ నుంచి టికెట్ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఎన్నికలో బరిలో ఉన్నారు.