తెలంగాణ ప్రభుత్వం విద్యా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం ‘మన ఊరు-మన బడి’ కింద సకల సౌకర్యాలను కల్పిస్తున్నది. ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చి కార్పొరేట్కు దీటుగా విద్యనందిస్తున్నది. పదో తరగతిలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ఈసారి జిల్లాలోని 961 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 49,754 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిత్యం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ అల్పాహారాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 35 పీఎస్ల పరిధిలో 219 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
రంగారెడ్డి, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తున్నది. పాఠశాల విద్యతోనే విద్యార్థుల చదువు ఆగిపోకూడదనే ఆలోచనతో వారి రేపటి భవితకు పాఠశాల విద్య నాంది కావాలని పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు తప్పిపోకూడదని ప్రత్యేక కార్యాచరణను చేపడుతున్నది. పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ 100 శాతం వారు ఉత్తీర్ణత సాధించేలా పకడ్బందీ ప్రణాళికతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతున్నది. పాఠశాలలో తరగతుల నిర్వహణ అనంతరం, సాయంత్రం వేళ విద్యార్థులు ఆకలితో అలమటించకుండా అల్పాహారం అందిస్తున్నది. విద్యార్థులకు ఎప్పటికప్పుడు టెస్టులు నిర్వహించి, అధ్యయనంలో వెనకబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నది. విద్యార్థులకు పాఠ్యాంశాలలో పట్టు సాధించేలా పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో 961 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి 49,754 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ఈ యేడాది 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే ధ్యేయంగా పెట్టుకొని విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న విద్యార్థులకు అనుగుణంగా ఫలితాలు ఉండేలా జిల్లా అధికార యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తున్నది. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తున్నది. అధ్యయనంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించి క్లిష్టమైన పాఠ్యాంశాలను తిరిగి అర్థమయ్యేలా బోధిస్తున్నది. చాలా పాఠశాలల్లో ఇప్పటికే సిలబస్ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి విద్యార్థుల్లో ఉన్న భయాందోళనను పోగొడుతున్నారు. విద్యార్థుల భవితవ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి విషయంలో ఆయా పాఠ్యాంశాలపై వారాంతంలో విద్యార్థులకు స్లిప్ టెస్టులను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రత్యేకంగా ప్రశ్నలు రూపొందించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో గణితంలో విద్యార్థులకు ప్రత్యేకంగా మెళకువలు నేర్పిస్తున్నారు. గణితంపై విద్యార్థుల్లోని భయాన్ని పోగొట్టేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులను ఉత్తీర్ణతకు కృషి చేయాలని డీఈవో సుశీందర్రావు సూచిస్తున్నారు. స్లిప్, ప్రీ ఫైనల్ టెస్టులు పూర్తయిన వెంటనే సమాధాన పత్రాలను దిద్ది ఇవ్వడం ద్వారా మరుసటి టెస్ట్కు వెనుకబడిన విద్యార్థులను సన్నద్ధం చేసేలా సలహాలు, సూచనలు జారీ చేశారు. దీని ద్వారా విద్యార్థుల్లోని లోటుపాట్లను ఉపాధ్యాయులు సవరించే అవకాశం ఏర్పడుతుంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం నిర్వహించే పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం అందిస్తున్నది. దీని ద్వారా దూర ప్రాంతాల విద్యార్థులు ప్రత్యేక తరగతులకు పూర్తిస్థాయిలో హాజరు కానున్నారు. అల్పాహారం ఇవ్వడమే కాకుండా విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టేందుకు మోటివేషన్ తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో ఆత్వ విశ్వాసం పెంచి ఉత్తీర్ణత సాధించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని 301 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 1 వరకు 18,730 (8,565 మంది బాలురు, 10,165 మంది బాలికలు) మంది విద్యార్థులు అల్పాహారం అందిస్తున్నారు. అల్పాహారానికి సంబంధించిన నిధులను ఇప్పటికే ప్రభుత్వం ఆయా పాఠశాలల విద్యా కమిటీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసింది.
ఏప్రిల్ 3 నుంచి జరిగే వార్షిక పరీక్షలకు రంగారెడ్డి జిల్లా నుంచి 49,754 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లావ్యాప్తంగా పదో తరగతి ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు 961 ఉన్నాయి. ఆయా విద్యా సంస్థల్లో 25,214 మంది బాలురు, 24,540 మంది బాలికలు ఉన్నారు. ప్రైవేట్ యాజమాన్యం నుంచి 660 పాఠశాలలకుగాను 31,024 (16,649 మంది బాలురు, 14,375 మంది బాలికలు) విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇదివరకే ఫెయిలైనవారు 709 మంది ప్రస్తుతం పరీక్షలు రాయనున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13 వరకు కొనసాగనున్నాయి. ఆ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వం అనేక జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నది. ఈ విద్యా (2023) సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు రెండు పర్యాయాలు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి ప్రీ ఫైనల్ పరీక్షలను ఈ నెల 22 నుంచి, రెండో ప్రీ ఫైనల్ను మార్చి 14 నుంచి చేపట్టనున్నారు. ఈ అకాడమిక్ ఇయర్లో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు జరుగనుండటంతో ఎస్సీఈఆర్టీ మార్గదర్శకాల మేరకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు జిల్లా విద్యా శాఖ ముందస్తుగా విద్యార్థులను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ, వెనుకబడిన వారిని గుర్తించి, వారిని కూడా పరీక్షలకు సిద్ధం చేసేందుకు వార్షిక పరీక్షల తరహాలోనే ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను రూపొందించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమాధాన పత్రాలను ఉపాధ్యాయులు వెంటనే మూల్యాంకనం చేసి విద్యార్థుల ప్రగతిని జిల్లా విద్యా శాఖ అధికారికి అందజేయనున్నారు.
– సుశీందర్రావు, జిల్లా విద్యాధికారి
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలి. విద్యార్థులు భయాందోళనకు గురి కాకుండా పరీక్షలకు సన్నద్ధమైతే ఆశించిన ఫలితాలు రాబట్టొచ్చు. మంచి ఫలితాలు రావాలనే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. జిల్లాలో 35 పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో 219 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నాం. గతంలో వచ్చిన ఫలితాలను మించి ఈసారి 100 శాతం ఉత్తీర్ణులు కావాలి.