సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): జాతకం బాగులేదని, బాగుచేసేందుకు పూజలు చేయాలంటూ నమ్మించి జ్యోతిష్యం పేరుతో నగర మహిళకు రూ. 47 లక్షలు మోసం చేసిన బాబాను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ వివరాలను వెల్లడించారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న బాధితురాలు మూడు నెలల కిందట ఇన్స్టాగ్రామ్లో జ్యోతిష్యుడి కోసం వెతికింది. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ అస్ట్రో- గోపాల్ అనే ఐడీకి సంబంధించిన ప్రొఫైల్ను పరిశీలించిన ఆమె.. జ్యోతిష్యుడని నిర్ధారించుకొని కాంటాక్టు చేసింది.
మీ జాతకం బాగులేదని, పూజలు చేయాలని అతడు చెబుతూ.. వెంటనే రూ. 32,000 చెల్లించాలని సూచించాడు. దీంతో ఆమె డబ్బు చెల్లించింది. పూజకు సంబంధించిన పలు సూచనలు చేశాడు. ఆ తర్వాత అతడు.. మీ పూజలు సరిగా కాలేదు.. చెప్పిన సమయంలో పూజలు చేయలేదు.. మీరు తప్పు చేశారంటూ.. రకరకాల కారణాలు చెబుతూ బాధితురాలి నుంచి దఫ దఫాలుగా రూ. 47,11,808 వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నాడు. ఆలస్యంగా మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు జ్యోతిష్యుడిని నిలదీసింది. తన డబ్బులు తనకు ఇవ్వాలంటూ కోరింది. డబ్బులు తిరిగి ఇచ్చేందుకు అతడు నిరాకరించడంతో బాధితురాలు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
తండ్రి పేరుతో ఐడీ నిర్వహిస్తూ..
పంజాబ్కు చెందిన లలిత్ జ్యోతిష్యుడు. అతడి తండ్రి గోపాల్ శాస్త్రి కూడా జ్యోతిష్యుడు కావడంతో ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడీని నిర్వహిస్తున్నాడు. అదే ఐడీ ద్వారా తాను కూడా ఆన్లైన్లో జ్యోతిష్యం చెబుతానంటూ లలిత్ ఫోన్నంబర్ను (959233095) కూడా ప్రచారం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే బాధితురాలిని మోసం చేసిన లలిత్ డబ్బు దోచుకున్నాడు. సైబర్క్రైమ్ ఏసీపీ ఏవీఎం ప్రసాద్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ హరిభూషణరావు బృందం ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. నిందితుడు లలిత్ పంజాబ్లో ఉన్నట్లు గుర్తించి, అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు.