పెద్దేముల్, డిసెంబర్ 29 : ప్రజలకు అటవీప్రాంతం అనుభూతిని కల్పించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నిర్మించిన అర్బన్ పార్కులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ ఐఎఫ్ఎస్ శాంతారామ్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలో 1, వికారాబాద్ జిల్లాలోని 4 అర్బన్ పార్కులను పరిశీలించారు. తాండూరు ఫారెస్ట్ రేంజ్లోని గొట్లపల్లి అర్బన్ పార్కును క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలకు కల్పించవలసిన వివిధ రకాల వసతులు, నిధుల మంజూరు, జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇదివరకు అర్బన్ పార్కుల్లో జరిగిన వివిధ రకాల పనులను పరిశీలించి ప్రజలకు తాగునీరు, అంతర్గత రోడ్లు, ఫెన్సింగ్లతోపాటు మూత్రశాలలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. వికారాబాద్ జిల్లాలో పరిగి ఫారెస్ట్ రేంజ్లో జాఫర్పల్లిలో, వికారాబాద్ రేంజ్లో అనంతగిరి, ధారూరు రేంజ్లో నాగసముందర్, తాండూరు రేంజ్లో అంతారం-గొట్లపల్లి గ్రామాల మధ్యలో అర్బన్ పార్కుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
తాండూరు రేంజ్లోని గొట్లపల్లి అర్బన్ పార్కు నిర్మాణానికి కోటీ50లక్షలు మంజూరుకాగా.. అందులో రూ.కోటీ20లక్షలు పార్కు చుట్టూరా ఫెన్సింగ్కు, రూ.15 లక్షలు ఎంట్రీ ప్లాజాలకు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. 2 నెలల్లో అర్బన్ పార్కుల్లో ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 80% శాతం పలు అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు.. మిగతా పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. ప్రజలకు అటవీ ప్రాంతాలపై మక్కువ పెంచేలా ప్రభుత్వం పార్కుల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్రావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగజ్యోతి, తాండూరు బీట్ ఆఫీసర్ మల్లయ్య, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.