రంగారెడ్డి, జూలై 23(నమస్తే తెలంగాణ): పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నూతనంగా రేషన్ కార్డుల పంపిణికీ శ్రీకారం చుట్టారని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డిజిల్లాలో కొత్తగా 35,488 రేషన్కార్డులు మంజూరైనట్లు వెల్లడించారు. ఈ కార్డులను ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు లబ్ధిదారులకు పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు నెల నుంచి కొత్త కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పేదలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రేషన్కార్డుల పంపిణీ ప్రారంభమవుతుండటంతో వారి కండ్లల్లో ఆనందం కనిపిస్తుందన్నారు. చెప్పారు. లాక్డౌన్ సమయంలో రేషన్కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందించినట్లు తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ అమయ్కుమార్, అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు, డీఎస్వో రాథోడ్నాయర్, సివిల్ సప్లయ్ డిఎం కామరాణి, బాల సరోజ, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
మున్సిపాలిటీలకు మహర్దశ
పట్టణ ప్రగతి కార్యక్రమంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7, 10వ వార్డులలో రూ.40లక్షలతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేషన్, మున్సిపాలిటీల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెలా రూ.148 కోట్లు మంజూరు చేస్తున్నారన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రణాళిక బద్ధంగా పట్టణాల అభివృద్ధికి ముందుకు సాగుతున్నారన్నారు. శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రింగ్రోడ్డు లోపల ఉన్న శివారు నియోజకవర్గాల్లో రూ.1200 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కరానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్, బడంగ్పేట్, జల్పల్లి, తుక్కుగూడలలో తాగునీటి పైపులైన్ల ఏర్పాటుకు రూ.211 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. బడ్జెట్లో పదిశాతం గ్రీనరీకి కేటాయించి హరిత తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. గ్రామాల్లో పచ్చదనం.. పరిశుభ్రత పెరిగిందని, పట్టణాల్లో అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దశలవారీగా కాలనీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. నేడు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని సూచించారు. ఒకేరోజు ఒకే గంటలో మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నట్లుతెలిపారు. కార్యక్రమంలో మేయర్ పారిజాతనర్సింహారెడ్డి, కార్పొరేటర్లు లక్ష్మారెడ్డి, రోహిణి రమేశ్ పాల్గొన్నారు.